Yadadri | యాదాద్రి : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయంభూ ప్రధానాలయం, అనుబంధ దేవాలయం శ్రీపూర్వగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సోమవారం లక్ష్మీనృసింహస్వామి జయంత్యోత్సవాలను అర్చకులు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. గర్భాలయ ముఖ మండపంలో మంత్ర సౌష్టవంగా, వేద సౌష్టవంగా, కళాత్మకంగా మహావైభోపేతంగా ఉత్సవాలు జరిగాయి. ఉదయం ప్రధానాలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామివారికి అభిషేకం, అర్చనలు నిర్వహించారు.
8.30 గంటలకు ఆలయ ముఖ మండపంలో స్వస్తీవాచనం, విశ్వక్సేనారధన పూజ, పుణ్యాహవాచనం, ఋత్విక్ వరణం, కుంకుమార్చన, రక్షాబంధనం వంటి కైంకర్యాలను చేపట్టారు. అనంతరం శ్రీస్వామివారికి లక్ష కుంకుమార్చన గావించనున్నారు. 11 గంటలకు తిరు వేంకటపతి అలంకారసేవలో శ్రీస్వామి వారిని ఆలయంలో ఊరేగింపు చేపడతారు. సాయంత్రం 6.00 గంటలకు మృత్సంగ్రహణం, అంకురార్పణ, హవనం వంటి కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు లక్ష్మీనరసింహచార్యులు, తాండూర్ వెంకటాచార్యులు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహారెడ్డి , ఈవో భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.