సుబేదారి, మే 17: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నర్సంపేట డివిజన్లో ఇండ్ల తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని వరంగల్ సీసీఎస్, నర్సంపేట పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి పెద్ద మొత్తంలో బంగారు ఆభరణాలు, వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. హనుమకొండలోని వరంగల్ పోలీస్ కమిషనరేట్లో పోలీస్ కమిషనర్ తరుణ్జోషి మంగళవారం వివరాలను వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం పొనుగోడు గ్రామానికి చెందిన పెనుక చందూలాల్ ఏడాది కాలంగా నర్సంపేటలోని చిన్నమ్మ దగ్గర ఉంటూ మార్కెట్లో పండ్లు విక్రయించేవాడు. సులువుగా డబ్బు సంపాదించాలని నర్సంపేట చుట్టుపక్కల ప్రాంతాల్లో తాళం వేసిన ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడ్డాడు. నర్సంపేట పోలీస్స్టేషన్ పరిధిలో నాలుగు, దుగ్గొండి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి, హనుమకొండ డివిజన్ కేయూసీ, వరంగల్ డివిజన్ మిల్స్కాలనీ, కాజీపేట డివిజన్ హసన్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కోచోట దొంగతనాలు చేశాడు. బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో ఈస్ట్జోన్ డీసీపీ వెంకటలక్ష్మి, క్రైమ్స్, ఆపరేషన్ అడిషనల్ డీసీపీ పుష్పారెడ్డి, వరంగల్ సీసీఎస్ ఏసీపీ డేవిడ్రాజ్, నర్సంపేట ఏసీపీ సంపత్రావు ఆదేశాల మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. పక్కా సమాచారంతో నర్సంపేట బస్స్టేషన్లో నిందితుడు చందూలాల్ను అరెస్టు చేసి, 141 గ్రాముల బంగారం, 1,070 గ్రాముల వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ప్రతిభ చాటిన డీసీపీలు వెంకటలక్ష్మి, పుష్పారెడ్డి, నర్సంపేట ఏసీపీ సంపత్రావు, క్రైం ఏసీపీ డేవిడ్రాజ్, సిబ్బందిని సీపీ అభినందించారు.