GT vs CSK : ఐపీఎల్ పదిహేడో సీజన్లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) తొలిసారి చాంపియన్ తరహాలో ఆడింది. హ్యాట్రిక్ ఓటముల నుంచి తేరుకొని సొంతగడ్డపై కీలక పోరులో జయభేరి మోగించింది. ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings)కు షాకిస్తూ 35 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఓపెనర్లు శుభ్మన్ గిల్(104), సాయి సుదర్శన్(103) సెంచరీలతో కదం తొక్కగా.. ఆ తర్వాత మోహిత్ శర్మ(3/31) బంతితో చెలరేగాడు. భారీ ఛేదనలో డారిల్ మిచెల్(63), మోయిన్ అలీ(56)లు మినహా సీఎస్కే టాప్ బ్యాటర్లంతా విఫలమయ్యారు. దాంతో, చెన్నై ఓటమికి తప్పలేదు.
గుజరాత్ నిర్దేశించిన భారీ ఛేదనలో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆదిలోనే కషాల్లో పడింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రచిన్ రవింద్ర(1)ను డేవిడ్ మిల్లర్ రనౌట్గా వెనక్కి పంపగా.. ఇంప్యాక్ట్ ప్లేయర్గా వచ్చిన సందీప్ వారియర్ చెన్నై ఇంప్యాక్ట్ ఓపెనర్ అజింక్యా రహానే(1)ను బోల్తా కొట్టించాడు. ఫామ్లో ఉన్న రుతురాజ్ గైక్వాడ్(0) భారీ షాట్ ఆడి గోల్డెన్ డక్ అయ్యాడు. బౌండరీ వద్ద రషీద్ ఖాన్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో 10 పరుగులకే సీఎస్కే మూడో వికెట్ పడింది.
మోయిన్ అలీ(56), డారిల్ మిచెల్(63)
ఆ దశలో డారిల్ మిచెల్(63), మోయిన్ అలీ(56)లు దూకుడుగా ఆడి చెన్నైని ఆదుకున్నారు. నాలుగో వికెట్కు 109 రన్స్ జోడించి చెన్నైని పోటీలో నిలిపారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ ఇద్దరినీ మోహిత్ శర్మ స్లో బాల్తో ఔట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. స్ట్రాటజిక్ బ్రేక్ తర్వాత మళ్లీ బంతి అందుకున్న మోహిత్ డేంజరస్ శివం దూబే(21)ను ఫుల్టాస్తో బోల్తా కొట్టించాడు. ఇక ఆ తర్వాత రషీద్ ఖాన్ తన మ్యాజిక్ చూపిస్తూ వరుస బంతుల్లో రవీంద్ర జడేజా(18), మిచెల్ శాంట్నర్(0)ను ఔట్ చేయడంతో 169కే చెన్నై 8 వికెట్లు కోల్పోయింది. రషీద్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో ధోనీ(26 నాటౌట్) రెండు సిక్సర్లు, ఫోర్ బాదినా గెలిపించలేకపోయాడు. దాంతో, గుజరాత్ 35 పరుగులతో గెలుపొందింది.
ఐపీఎల్ పదిహేడో సీజన్లో భారీ స్కోర్ బాకీ పడిన వెనకబడిన గుజరాత్ టైటాన్స్ కీలక పోరులో గర్జించారు. సొంత మైదానంలో ఓపెనర్లు ఓపెనర్లు సాయి సుదర్శన్(103 51 బంతుల్లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు), కెప్టెన్ శుభ్మన్ గిల్(104 55 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్సర్లు)లు సెంచరీలతో చెలరేగారు. చెన్నై సూపర్కింగ్స్పై భారీ స్కోర్ కొట్టింది. నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది.
వీళ్లిద్దరి ఊచకోతకు సీఎస్కే బౌలర్లు ప్రేక్షకులవ్వగా.. అహ్మదాబాద్ స్టేడియం రికార్డులతో దద్ధరిల్లిపోయింది. ఐపీఎల్లో శతక్కొట్టిన భారత తొలి ఓపెనర్లుగా సాయి, గిల్ చరిత్ర సృష్టించారు. అంతేకాదు సీఎస్కేపై అత్యధికంగా 231 రన్స్ కొట్టిన పంజాబ్ కింగ్స్ రికార్డును ఈ మ్యాచ్లో గుజరాత్ సమం చేసింది.