హనుమకొండ చౌరస్తా, మే 10 : వరంగల్ హెల్త్సిటీగా నిర్మాణమవుతుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కార్మిక చైతన్య మాసోత్సవాల సందర్భంగా హనుమకొండ టీటీడీ కల్యాణ మండపం ప్రాంగణంలో మెగా హెల్త్క్యాంపును రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, నన్నపునేని నరేందర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, రైతు రుణవిమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లుతో కలిసి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ జైలు స్థానంలో రూ.1200 కోట్లతో మల్టీసూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నట్లు, పేదలకు ఉచితంగా వైద్యాన్ని అందించేందుకు అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు చెప్పారు. 24 అంతస్తుల్లో 2 వేల పడకలు ఏర్పాటు చేయనున్నట్లు, అవసరమైతే నెలలో 3,4 స్లాబ్లు వేయాలని ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.
గత ప్రభుత్వాలు ఎప్పుడూ దవాఖానలను పట్టించుకోలేదని, హైదరాబాద్లో 4, వరంగల్ 1 సూపర్స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఏడాదిలోగా దవాఖాన పూర్తవుతుందని, మరో ఆరు నెలల్లో అన్ని రకాల పరికరాలు అందించనున్నట్లు తెలిపారు. సూపర్స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా పేదలకు అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదని, కార్మికుల వ్యతిరేక పార్టీ బీజేపీ అని అన్నారు. 12 గంటలు పనిచేస్తున్న కార్మికుల గురించి ఎప్పుడైనా ఆలోచించిందా.. మరింత కఠినమైన చట్టాలు తీసుకొచ్చి కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆయన మండిపడ్డారు.
గ్యాస్ సిలిండర్లు అందించే ఉజ్వల్ పథకం కేవలం ప్రచారానికే పరితమైందన్నారు. హోర్డింగ్స్ ఏర్పాటు చేసుకోవడం తప్ప అందజేసిందిలేదు.. గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచిన కారణంగా పేదలు తిరిగి పొయ్యిల కట్టెలు కొంటున్నారన్నారు. సబ్సిడీ రూ.400 నుంచి రూ.40కి తగ్గించిందని, నిత్యావసర ధరలు పెంచి సామాన్య ప్రజలపై భారం మోపిందని మండిపడ్డారు. ఆటోలకు లైఫ్టాక్స్ మాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్మికులకు రూ.6 లక్షల ఉచిత బీమా చేసింది తెలంగాణ ప్రభుత్వమేనని మంత్రి హరీశ్రావు అన్నారు. భవన నిర్మాణ కార్మికులకు సబ్సిడీపై 50 రోజుల్లో లక్ష మోటరు సైకిళ్లను అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వివరించారు. కార్మిక బంధువు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అని అన్నారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నారని వివరించారు. కార్మికులకు ఐడీ కార్డులు, ఇన్సూరెన్స్, వివిధ సంక్షేమ కార్యక్రమాలు అందిస్తూ మే నెలంతా కార్మికుల కోసం కృషి చేస్తున్న వ్యక్తి వినయ్భాస్కర్ అని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు, డీఎంహెచ్వో డాక్టర్ సాంబశివరావు, అడిషనల్ డీఎంహెచ్వో యాకూబ్అలీ, టీఆర్ఎస్ నాయకులు జన్ను జకార్య, పుల్లా శ్రీనివాస్, నారాయణ, దేవేందర్గౌడ్, వైద్య సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
కార్మికులకు ప్రభుత్వం అండగా ఉంటుంది..
సంఘటిత, అసంఘటిత కార్మికులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుంది. కార్మికులకు ఏవిధమైన ఆరోగ్య సమస్యలున్నా వెంటనే ఆస్పత్రిలో చూపించుకోవాలి. ఉచితంగా ప్రభుత్వం వైద్య సేవలందిస్తుంది. ఆరోగ్యం మెరుగయ్యే వరకు ప్రభుత్వం అండగా ఉంటుంది. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. మే నెల మొత్తం కార్మిక మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. కార్మికుల కోసం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశాం. వైద్యపరీక్షలు చేసుకుని కార్మికులు ఉచితంగా మందులు తీసుకున్నారు. కార్మికుల ఆరోగ్యరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుంది.
– దాస్యం వినయ్భాస్కర్, ప్రభుత్వ చీఫ్ విప్