హనుమకొండ సబర్బన్, మే1 ;అన్నదాతలు సాగు రంగంలో వినూత్న ప్రయోగాలకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం, భూగర్భ జలాలు పైపైకి వస్తున్న నేపథ్యంలో రైతులు పంట క్షేత్రాలను ప్రయోగ శాలలుగా మారుస్తున్నారు. ప్రస్తుతం పత్తి ధరలు రూ.12 వేలు దాటి పోవడంతో ఈ సారి రైతులు ఈ పంటను ఏకంగా యా సంగిలోనూ పండించేందుకు శ్రీకారం చుట్టారు. వరంగల్ జిల్లాలో గతేడాదే ఈ రకం పత్తిని యాసంగిలో కొందరు రైతులు ప్రయోగాత్మకంగా పండించగా, ఈ సారి హనుమకొండ జిల్లాలో సైతం సుమారు ఇరవై ఎకరాల్లో మొదలు పెట్టారు. ఇప్పటికే పత్తి ఏపుగా పెరుగగా, ఎకరాకు 6 నుంచి 7 క్వింటాళ్ల దిగు బడి వస్తుందని అంచనా వేస్తున్నారు.
రైతులు ఆర్థికంగా లాభాలు పొందేందుకు కొత్తకొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. యాసంగిలోనూ పత్తి పంటను పండిస్తూ దిగుబడిలో కూడా ఆశాజనక ఫలితాలను పొందేందుకు యత్నిస్తున్నారు. ధర్మసాగర్ మండలం దేవునూరు గ్రామంలోని రైతులు సంగెకారి రాములు, శంకర్రావు ఈ యాసంగిలో పత్తిని సాగు చేయగా, ఈ మండువేసవిలో కూడా పంట చేను ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నది. సంగెం, గీసుగొండ, నెక్కొండ, వర్ధన్నపేట ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ యాసంగి పత్తిని సాగు చేసినట్లుగా అధికారులు చెబుతున్నా రు.
144 పేరిట కావేరి, సాంకేత్ పేరిట నాథ్ విత్తన కంపెనీలు యాసంగిలో సాగు చేసేలా విత్తనాలను ఉత్పత్తి చేసి రైతులకు అందించారు. ఇవి కేవలం మూడు నెలల వ్యాలిడిటీతో మాత్రమే ఉత్పత్తి చేశారు. వీటిని వర్షాకాలంలో సాగు చేసేందుకు వీలుండదు. ఇప్పుడు ఆయా గ్రామాల్లో సాగవుతున్న యాసంగి పత్తి సుమారుగా ఆరు నుంచి ఏడు క్వింటాళ్ల వరకు దిగుబడి రావచ్చని అంచనా వేస్తున్నారు. గత నవంబర్, డిసెంబర్ మాసాల్లో వేసిన ఈ పత్తి చేన్లలో ఇప్పుడు పత్తి ఏరడానికి వచ్చింది. ప్రస్తుతం పత్తికి మంచి ధర ఉండడంతో రైతులకు ఎకరానికి రూ.60 నుంచి 70 వేల ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి. కేవలం వానాకాలంలో మాత్రమే పండే పత్తి పంటను ఇప్పుడు యాసంగి పంటగా కూడా సాగు చేస్తుండడంతో అందరు రైతులు ఆసక్తిగా చూస్తున్నారు.
దిగుబడి మంచిగ వస్తుందనుకుంటున్న..
మా చుట్టాలు యాసంగి పత్తిని సాగు చేస్తున్నారని తెలిసి నేను యాసంగిలో వేద్దామని వేసిన. ఇప్పటికైతే చేను మంచిగనే ఉన్నది. మొన్నటి నుంచే పత్తి ఏరుడు మొదలు పెట్టినం. మంచి దిగుబడి వస్తుందనుకుంటున్న.
– సంగెకారి రాములు, రైతు, దేవునూరు
రైతులు అడిగితే విత్తనం తెప్పించా
కొన్ని ప్రాంతాల్లో యాసంగి పత్తిని సాగు చేస్తున్నారని తెలుసుకున్న రైతులు నన్ను సంప్రదించారు. నేను వరంగల్ విత్తన డిస్ట్రిబ్యూటర్ను అడిగి విత్తనాలను తెప్పించి ఇచ్చా. నేను తరచుగా చేన్ల వద్దకు వెళ్లి చూస్తున్నా. మంచి ఏపుగానే వస్తున్నది.
– కందారపు ప్రవీణ్ చారి, సీడ్స్ వ్యాపారి