హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో కాసేపు ముచ్చటించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ ఎల్బీనగర్లో ఉన్న సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అనంతరం స్టేడియం నుంచి బటయకు వచ్చిన ఆయన సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అటుగా వెళ్తున్న బస్సు ఎక్కారు. అప్పటికే కిక్కిరిసిపోయిన బస్సులో ఎక్కిన రాహుల్.. మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న మహిళలకు ఉచిత బస్సు పథకం గురించి వాకబుచేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో గురించి వివరించారు. కాంగ్రెస్ న్యాయ్ ప్రచార పత్రాలను వారికి అందించారు.
కాగా, రాహుల్ గాంధీ పాల్గొన్న చేవెళ్ల, మల్కాజిగిరి, భువనగిరి మూడు పార్లమెంటరీ నియోజవర్గాల ప్రచార సభ జనాలు లేక వెలవెలబోయింది. ఆయన అక్కడికి వచ్చే లోగా సభ నిండలేదు. పట్టుమని 100మంది కూడా అక్కడ లేరు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. జనం లేరన్న విషయం తెలుసుకున్న రాహుల్ బయటే ఆగిపోయారు. కారవాన్ కూడా దిగలేదు. కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైంది. తత్తరబిత్తర అయిపోయి, ఎవరికి వారు పురమాయింపుల్లోకి దిగారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్వయంగా వ్యాన్ దిగి, రోడ్డుమీదికి వచ్చారు. స్టేడియం గేటు వద్ద నిలబడి ప్రజల్ని లోపలికి పంపే పనిలోకి దిగారు.
Rahul Gandhi took a bus ride in Telangana during is campaign with CM @revanth_anumula and interacted with the commuters, he also distributed NYAY Patra and educated passengers about congress manifesto!!
Rahul is a real people’s leader who listen to them, its people’s Man Ki Baat… pic.twitter.com/6v8Kx8ZBNL
— NSUI Tamil Nadu (@NSUITamilNadu) May 9, 2024
అప్పుడే డీసీఎం దిగుతున్న ప్రజలను ‘లోపలికి పదండి..’ అంటూ పురమాయించారు. భద్రతా సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు కూడా అక్కడున్న వారిని స్టేడియం లోపలికి పంపుతూ కనిపించారు. ఇట్లా ‘జనసమీకరణ’ 45 నిమిషాలపాటు సాగింది. అంతసేపూ సీఎం రేవంత్ రోడ్డుపైనే వేచి చూశారు. రాహుల్గాంధీ కారవాన్లోనే ఉండిపోయారు. చివరకు 7.10 గంటలకు రాహుల్ వేదిక మీదికి వచ్చారు. ఎట్టకేలకు కొంతమంది జనం రావడంతో సభ మొదలైంది. బహిరంగ సభ ముగిసే సమయానికీ మైదానంలో రెండు వేల మంది కూడా లేరు. రాహుల్కూడా నిరాసక్తంగా కనిపించారు. 16 నిమిషాల్లోనే ఆయన తన ప్రసంగం ముగించారు. ఎలాగోలా సభ ముగియడంతో అక్కడున్న కాంగ్రెస్ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ అప్పటికే రాజకీయవర్గాల్లో దుమారం చెలరేగింది. కాంగ్రెస్లో కలవరం మొదలైంది.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం.. అందునా 14 సీట్లు గెలుస్తున్నామంటూ ముఖ్యమంత్రే చెప్పుకుంటూ తిరుగుతున్న వేళ.. సరూర్నగర్ సభ అట్టర్ఫ్లాప్ కావడం కాంగ్రెస్ నాయకత్వానికి మింగుడుపడని పరిణామంగా మారింది. పార్టీ రాష్ట్ర సారథి, ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా రోడ్డుమీదికి వచ్చి జన సమీకరణకు దిగడంతో.. కాంగ్రెస్ శ్రేణులు నివ్వెరపోయాయి. పార్లమెంటు ఎన్నికలపై అంతోఇంతో ఆశలు పెట్టుకున్న ఆ పార్టీ శ్రేణుల్లో ఒక్కసారిగా నిస్తేజం ఆవరించింది. ఇటీవల చేవెళ్ల పార్లమెంటు పరిధిలోని బాలాపూర్లో సీఎం రేవంత్రెడ్డి కార్నర్ మీటింగూ జనం లేక వెలవెలబోయింది. కానీ, ఈసారి దానిని మించి.. అదీ రాహుల్గాంధీ సభకు ఈ తరహా ప్రజావ్యతిరేకతను కాంగ్రెస్ నాయకులు ఊహించలేకపోయారు. దీంతో.. రాహుల్ ముందే రాష్ట్ర కాంగ్రెస్ పరువు గంగలో కలిసినట్టయ్యిందని వాపోయారు. జనసమీకరణలో విఫలం కావడంపై సభా వేదిక వద్ద నేతల మీద రేవంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
45 నిమిషాలు వేచి.. ఇక లాభం లేక!
సభా ప్రాంగణానికి వచ్చిన రాహుల్గాంధీ ఏకంగా 45 నిమిషాల పాటు ప్రజల కోసం వేచి చూశారు. కానీ పెద్దగా ప్రజలు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ఎట్టకేలకు సాయంత్రం 7.10 గంటలకు రాహుల్ సభా వేదికపైకి వచ్చారు. అప్పటికీ ప్రాంగణంలో కుర్చీలన్నీ దాదాపుగా ఖాళీగా దర్శనమిచ్చాయి. ఇక లాభం లేదనుకుని వెంటనే సీఎం రేవంత్రెడ్డి తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సీఎం ప్రసంగిస్తుండగానే చాలామంది మహిళలు వెనక్కి వెళ్లిపోవడం కనిపించింది. దీంతో రేవంత్ తన ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించి.. రాహుల్గాంధీ మాట్లాడాల్సిందిగా కోరారు. దీంతో రాహుల్ కూడా తన ప్రసంగాన్ని త్వరగానే ముగించారు. దీంతో సభకు వచ్చిన కాంగ్రెస్ నేతల ముఖాల్లో నిరాశ, నిస్పృహలు కనిపించాయి. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల మధ్యలో ఉన్న ఈ సభా ప్రాంగణం చుట్టుపక్కల భువనగిరి లోక్సభ స్థానం పరిధిలోని ప్రాంతాలకు చెందిన వారు కూడా పెద్ద ఎత్తున నివాసముంటారు. అయినప్పటికీ సభకు ప్రజలు రాకపోవడంపై తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీపై క్షేత్రస్థాయిలో ఉన్న వ్యతిరేకతకు ఇదో నిదర్శనమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.