పరకాల, ఏప్రిల్ 2: ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యనందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తును గురుకులాలను ప్రారంభించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోంది. ఉపాధ్యాయుల కృషి, ప్రజల సహకారంతో పరకాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత (సక్సెస్) పాఠశాల ఆదర్శంగా నిలుస్తోంది. ప్రతి ఏటా పదో తరగతిలో ఉత్తమ ఫలితాలను సాధిస్తోంది. మూడేండ్లుగా వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా దూసుకెళ్తోంది. విద్యార్థినుల సంఖ్యను పెంచుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది.
జాతీయస్థాయి క్రీడల్లోనూ విద్యార్థుల ప్రతిభ
పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు అహర్నిశలు కృషి చేస్తుండండతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయి. దీంతో ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. 2019-20వ విద్యా సంవత్సరంలో 222 మంది విద్యార్థినులు ఉండగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య 301కి పెరిగింది. 6వ తరగతిలో 62 మంది విద్యార్థులు, 7వ తరగతిలో 42 మంది, 8వ తరగతిలో 82 మంది, 9వ తరగతిలో 65, 10వ తరగతిలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. కాగా, ఈ పాఠశాలలో విద్యతోపాటు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడంతో పలువురు విద్యార్థులు జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని ప్రతిభ చాటారు.
పదిలో ఉత్తమ ఫలితాలు
ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల సాధనతో పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణతను సాధిస్తున్నారు. 2018-19,19-20, 20-21వ విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా రికార్డులకెక్కింది.
దాతల చేయూతతో వసతుల కల్పన
పాఠశాలలో విద్యార్థులు ప్రతిభ చూపి మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారు. దీంతో పాఠశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. గడిచిన మూడేండ్లలో పాఠశాలకు పలువురు దాతలు మూడు లక్షల రూపాయల విలువ గల సామగ్రిని అందించారు. పాఠశాల ఆవరణలో వంట గది నిర్మాణంతోపాటు కంప్యూటర్, ప్రొజెక్టర్, ఎల్ఈడీ టెలివిజన్, ప్రింటర్, స్కానర్, డిజిటల్ క్లాస్ రూం బోర్డ్స్, పోడియం, మైక్ సెట్, గదుల్లో ఫ్యాన్లను సమకూర్చుకున్నారు. విద్యార్థులకు మౌలిక వసతులు, నాణ్యమైన విద్య, ఉత్తమ ఫలితాలు రావడంతో స్కూల్ వంద శాతం సక్సెస్గా దూసుకుపోతోంది.
ప్రభుత్వ నిర్ణయంతో పాఠశాలలకు పునరుజ్జీవం
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీ పడుతున్నారు. గ్రామీణ పాఠశాలల్లో మౌలిక వసతులు పెరిగి మరింత మెరుగైన విద్య అందుతోంది. దీంతో రానున్న రోజుల్లో కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యార్థులు రాణించే అవకాశం ఉంది.
-భైరి మాధవి, ప్రధానోపాధ్యాయురాలు
మాలాంటి విద్యార్థులకు మేలు..
ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడం వల్ల విద్యార్థులకు మెరుగైన విద్య అందుతుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో చదువుకునే విద్యార్థులు ప్రైవేట్ విద్యార్థులతో పోటీ పడే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ బడుల్లో మౌలిక వసతుల కల్పనతో మాలాంటి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
– పావుశెట్టి అక్షిత, పదో తరగతి