తొర్రూరు, జనవరి 30 : పూర్వ విద్యార్థుల సహకారంతో మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చెర్లపాలెం గ్రామ ప్రభుత్వ ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలు నాణ్యమైన విద్యనందిస్తూ ఆదర్శంగా నిలిచాయి. రాష్ట్ర ప్రభుత్వం ‘మన ఊరు-మన బడి’ ద్వారా అన్ని పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి మౌలిక వసతుల కల్పనతో ముందడుగు వేయనున్న తరుణంలో చెర్లపాలెం పాఠశాలల అభివృద్ధికి, విద్యార్థులకు గ్రామస్తులు అందించిన సహకారం ప్రతి ఒక్కరినీ ఆకర్షిస్తోంది.
టీ‘చర్లపాలెం’గా గుర్తింపు
1964లో స్థాపించిన చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాల 2015లో గోల్డెన్ జూబ్లీ వేడుకలను జరుపుకుంది. 58 ఏళ్ల క్రితం ఇక్కడ ప్రభుత్వ పాఠశాల అందుబాటులోకి రావడంతో ఈ గ్రామంలో విద్యాధికుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఈ గ్రామం నుంచి ఇప్పటి వరకు 185 మంది వరకు ప్రభుత్వ టీచర్లు ఉండి అనేక ప్రాంతాల్లో సేవలందిస్తుండడం వల్ల టీ‘చర్లపాలెం’గా గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం 90 మంది విశ్రాంత ఉపాధ్యాయులున్నారు. తొలి ఉపాధ్యాయుడు పరుపాటి ధర్మారెడ్డి కృషితో హెచ్.ప్రతాప్రెడ్డి మరిపెడ సమితి ఉపాధ్యక్షుడిగా పనిచేయగా హైస్కూల్ విద్య పూర్తి చేసిన ఎంతోమంది ప్రభుత్వ ఉపాధ్యాయులయ్యారు. ప్రస్తుతం గ్రామం నుంచి 25 మంది ప్రవాస భారతీయులు ఉండగా ఇద్దరు సైంటిస్టులు, 40 మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, ఆరుగురు వైద్యులు, 25 మంది ఆర్టీసీ కండక్టర్లతో పాటు తొర్రూరు, వివిధ ప్రాంతాల్లో ప్రైవేట్ విద్యాసంస్థలు నిర్వహిస్తూ వ్యాపారాలు చేస్తున్న వారూ ఉన్నారు.
15 ఏళ్లుగా ఇంగ్లిష్ మీడియం..
చెర్లపాలెం జడ్పీ సెకండరీ పాఠశాలలో 2006-2007 విద్యాసంవత్సరంలోనే 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. 15ఏళ్లుగా ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్ మీడియం కోర్సులున్నప్పటికీ విద్యార్థులు మాత్రం ఆంగ్ల మాధ్యమంలోనే అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరంలో 210 మంది ఈ స్కూల్లో ఉన్నారు. చెర్లపాలెం, చీకటాయపాలెం, గోపాలగిరితో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన పలువురు విద్యార్థులు ఈ గ్రామంలో ఉన్న బీసీ హాస్టల్లో ప్రవేశం పొంది చదువుతుంటారు. ప్రాథమిక పాఠశాలలో కూడా సుమారు 150 మంది విద్యార్థులు ఉండగా ఇక్కడ కూడా ఇంగ్లిష్ మీడియం ఆడ్మిషన్లు ఎక్కువగానే ఉన్నాయి. నాలుగేళ్లుగా పదో తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధిస్తుండగా రెండేళ్లలో వార్షిక పరీక్షల్లో 11మంది విద్యార్థులు 10/10 గ్రేడ్ సాధించారు. ఈ పాఠశాలలోనే 6 నుంచి పదో తరగతి వరకు చదివిన గ్రామానికి చెందిన ధర్మారపు నాగయ్య కూతురు స్పందన గతేడాది నీట్లో ఎస్సీ కేటగిరీలో 949వ ర్యాంక్తో మెడిసిన్ సీట్ సాధించింది. ఉపాధ్యాయుల నిబద్ధత, బోధన శైలి, పూర్వ విద్యార్థులు, గ్రామస్తుల సహకారం ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు వరంగా మారింది.
రాజేందర్రెడ్డి-ఝాన్సీలక్ష్మీరెడ్డి దంపతుల ఔదార్యం
పాఠశాలలకు తన వంతు సహకారం అందిస్తూ హనుమాండ్ల రాజేందర్రెడ్డి, ఝాన్సీలక్ష్మీరెడ్డి దంపతులు ఆదర్శంగా నిలుస్తున్నారు. తన తల్లిదండ్రులు, రక్త సంబంధీకులకు చెంది న గ్రామాల్లో వారి స్మారకార్థం పాఠశాల భవనాలు నిర్మించారు. ఎక్కడ చదువుకుంటే ఆ పాఠశాల అభివృద్ధికి చేయూతనందించారు. చెర్లపాలెంతో పాటు నెల్లికుదురు మండలం కాచికల్లు, నల్లగొండ జిల్లా సోలిపేట, సూ ర్యాపేట జిల్లా నకిరేకల్, ఖమ్మం జిల్లా బనిగిల్లపాడు, ములుగు జిల్లా పందికుంట, వరంగల్ జిల్లా నర్సంపేటలోని అశోక్నగర్ పాఠశాలల్లో సుమారు రూ.2కోట్ల విలువైన నిధులతో పక్కా భవనాలను నిర్మించి ఇచ్చారు. చెర్లపాలెం, బనిగిల్లపాడు పాఠశాలల్లో ఏటా రూ.2లక్షల మేర స్కాలర్షిప్లు అందజేస్తున్నారు. ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేద విద్యార్థులకు రూ.10లక్షల మేర కళాశాల ఫీజులను నేరుగా చెల్లిస్తున్నారు.
ఊరుబడికి బాసటగా..
తమ ఉన్నతికి కారణమైన పాఠశాలకు చేతనైన సాయం చేస్తున్నారు. పాఠశాల స్వర్ణోత్సవాల సందర్భంగా నిర్మించిన బ్లాక్లతో తరగతి గదుల కొరత కూడా తీరింది. అమెరికాలో ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ హనుమాండ్ల రాజేందర్రెడ్డి, ఝాన్సీలక్ష్మీరెడ్డి దంపతులు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు రాజేందర్రెడ్డి మాతృమూర్తి రాధమ్మ స్మారకార్థం ఐదు గదులతో కూడిన భవనాన్ని నిర్మించి ఇచ్చా రు. ఉన్నత పాఠశాలలో రెండు తరగతి గదులు, డిజిటల్ విద్యాబోధనకు రెండు ప్రొజెక్టర్లను బహూకరించారు. ఎన్నో ఏళ్లుగా 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగు, ఇంగ్లిష్ మీడియంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ఏటా రూ.లక్ష మేర స్కాలర్షిప్లు, స్కూల్ బ్యాగులు అందిస్తూ పేద విద్యార్థులను ప్రోత్సహిస్తున్నారు.
వారి సహకారం మరువలేనిది
చెర్లపాలెం ప్రభుత్వ పాఠశాలలకు గ్రామ ప్రజలు, ఎన్నారైలు, ఉద్యోగులు అందిస్తున్న సహకారం వెలకట్టలేనిది. 15 ఏళ్ల క్రితం ఇక్కడ ఇంగ్లిష్ మీడియం ప్రారంభమైంది. ఐదేళ్లుగా ప్రభుత్వ ప్రోత్సాహం, ఉపాధ్యాయుల సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నాం. ఇంగ్లిష్ మీడియంతో చెర్లపాలెం స్కూల్ రోల్మోడల్గా నిలిచే విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. ఇటీవల సీఎం కేసీఆర్ ‘మన ఊరు-మన బడి’ ద్వారా ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి తీసుకుంటున్న నిర్ణయాలతో మాలాంటి పాఠశాలకు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. చిన్నాచితక సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి.