వరంగల్, ఏప్రిల్ 29(నమస్తే తెలంగాణ)/మహబూబాబాద్ రూరల్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థుల్లో ఆరుగురు, మహబూబాబాద్లో ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. వీరిలో వరంగల్లో స్వతంత్ర అభ్యర్థులు ఇసంపల్లి వేణు, మార్త రాజభద్రయ్య, కుమ్మరి కన్నయ్య, ఇల్లందుల శోభన్బాబు, వడ్డెపల్లి విజయ్కుమార్, బర్ల బాబు, మహబూబాబాద్లో ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలను పురస్కరించుకొని ఈ నెల 18 నుంచి 25 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే.
ఇందులో భాగంగా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొత్తం 58 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో పది మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురి కాగా, సోమవారం ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్ లోక్సభ స్థానం నుంచి 42 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో బీఆర్ఎస్ నుంచి డాక్టర్ మారెపల్లి సుధీర్కుమార్, బీజేపీ నుంచి అరూరి రమేశ్, కాంగ్రెస్ నుంచి కడియం కావ్య ఉన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మొత్తం 30 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో ఐదుగురు అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే. ఉపసంహరణ ముగిసిన అనంతరం 23 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇందులో బీఆర్ఎస్ నుంచి మాలోత్ కవిత, కాంగ్రెస్ పోరిక బలరాంనాయక్, బీజేపీ నుంచి అజ్మీరా సీతారాంనాయక్ ఉన్నారు. మే 13న పోలింగ్ జరుగనుంది.