హనుమకొండ, ఫిబ్రవరి 10: తెలంగాణపై ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ టీఎన్జీవో కేంద్ర సంఘం పిలుపు మేరకు గురువారం ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతరం హనుమకొండ జిల్లా టీఎన్జీవో నాయకుల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్ ఎదుట నల్లబ్యాడ్జిలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా అధ్యక్షుడు ఆకుల రాజేందర్ మాట్లాడారు. రాజ్యసభలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను, ఉద్యోగులను ఎంతో బాధించిందన్నారు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయంతోనే ఏర్పడిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ముఖ్యంగా రాష్ట్ర ఏర్పాటులో టీఎన్జీవోస్ యూనియన్ కీలక పాత్ర పోషించిందన్నారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బైరి సోమయ్య, అసోసియేట్ అధ్యక్షుడు పుల్లూరు వేణుగోపాల్, కోశాధికారి పనికెల రాజేశ్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దాస్యానాయక్, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సర్వర్ హుసేన్, డ్రైవర్ల సంఘం కార్యదర్శి గోపాల్, ఉద్యోగ సంఘాల నాయకులు రామునాయక్, చీకటి శ్రీనివాస్, వాసాల సింధూ రాణి, భగవాన్ రెడ్డి, రాజీవ్, ప్రణయ్, రవి, ప్రణీత్, గోవర్ధన్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణపై మోదీ వ్యాఖ్యలకు నిరసనగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉమ్మడి వరంగల్ జిల్లా కో-ఆర్డినేటర్ ఎన్నమనేని జగన్మోహన్రావు సారథ్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన తెలిపారు. హనుమకొండ కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం, హనుమకొండ, వరంగల్ జిల్లాల కార్యవర్గ సభ్యులు, అధికారులు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ రెడ్డి, నాగ నారాయణ, నాయకులు హరిప్రసాద్, సురేశ్కుమార్, అన్వర్, అజహర్, కవిత జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.