దళితబంధు పథకాన్ని పకడ్బందీగా అమలుచేసేందుకు అధికారయంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. ఈమేరకు కుటుంబాలను గుర్తించగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరి వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. పరిశీలన పూర్తికాగానే ఈ నెల 7వ తేదీలోగా వారి పేర బ్యాంకు ఖాతాలు తెరువనున్నారు. అలాగే పథకం ఉద్దేశంతో పాటు ఒనగూరే ప్రయోజనాలు, యూనిట్ల వివరాలపై నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, అధికారులు అవగాహన కల్పించనున్నారు. ఇందులో భాగంగా లబ్ధిదారుల ఎంపిక మొదలు గ్రౌండింగ్ వరకు సాఫీగా సాగేలా సమన్వయం చేసేందుకు కలెక్టర్ల ఆధ్వర్యంలో స్పెషల్ ఆఫీసర్లను నియమించగా, మార్చి 7వ తేదీలోగా అర్హులకు యూనిట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
వరంగల్, ఫిబ్రవరి 4(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం అమలుకు అధికారులు పక్కా ప్రణాళిక రూపొందించారు. ఇప్పటికే జిల్లాలో ఎస్సీ కుటుంబాలను గుర్తించారు. జాబితాలు అందుతుండడంతో క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ ప్రారంభించారు. పరిశీలన పూర్తికాగానే వారి పేర బ్యాంకులో ఖాతా తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ తర్వాత యూనిట్లను మంజూరు చేసి అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. మార్చి ఏడో తేదీలోగా యూనిట్లను గ్రౌండింగ్ చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ పథకం అమలు జరిగేలా కలెక్టర్ బీ గోపి జిల్లాస్థాయి ఐదుగురిని స్పెషల్ ఆఫీసర్లుగా నియమించారు. లబ్ధిదారుల ఎంపిక మొదలు యూనిట్ల గ్రౌండింగ్ వరకు సమన్వయం చేసే బాధ్యతలను వారికి అప్పగించారు. ఈమేరకు వారు రంగంలోకి దిగారు.
దళితబంధు పథకం ద్వారా తొలి విడుత ఈ ఏడాది మార్చిలోగా ప్రతి శాసనసభ నియోజకవర్గం పరిధిలో వంద మంది లబ్ధిదారులకు యూనిట్లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 5వ తేదీలోగా లబ్ధిదారుల ఎంపిక, మార్చి ఏడో తేదీలోగా లబ్ధిదారులకు యూనిట్ల గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించింది. ఆయా నియోజకవర్గంలో 100మందిని ఎంపిక బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేకు అప్పగించగా, ఎంపిక చేసే పనిలో వారు నిమగ్నమయ్యారు. ఆయా నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే కొద్దిరోజుల నుంచి తమ పార్టీ ముఖ్యనేతలతో సమావేశమై వంద మంది లబ్ధిదారులతో జాబితాను తయారు చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 5లోగా ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గం నుంచి వంద మంది చొప్పున ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాలు జిల్లా కలెక్టర్కు అందుతాయి. జిల్లాలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి వంద మంది లబ్దిదారులను ఎంపిక చేసి జాబితాను జిల్లా కలెక్టర్కు అందజేశారు. దీంతో అధికారులు సదరు ఎమ్మెల్యే ఇచ్చిన జాబితాలోని లబ్ధిదారులకు సంబంధించి వెరిఫికేషన్ చేపట్టారు.
జిల్లాలో ఐదు శాసనసభ నియోజకవర్గాల పరిధి ఉంది. నర్సంపేట, వరంగల్ తూర్పు నియోజకవర్గాల పరిధి పూర్తిగా, పరకాల, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి రెండేసి మండలాలు, పాలకుర్తి నియోజకవర్గంలోని ఒక మండలం ఈ జిల్లా పరిధిలో ఉంది. ఐదు నియోజకవర్గాల ఎమ్మెల్యేల నుంచి లబ్ధిదారుల జాబితాలు శనివారంలోపు అందగానే ఒకటి రెండు రో జుల్లో వెరిఫికేషన్ పూర్తి చేయనున్నారు. ప్రస్తుతం ఒక నియోజకవర్గంలో జరుగుతున్న వెరిఫికేషన్ శనివారం పూర్తి కానుందని తెలిసింది. మిగతా నాలుగు చోట్ల ఎ మ్మెల్యేల నుంచి జాబితాలు అందిన వెంటనే శని, ఆదివారాల్లో వెరిఫికేషన్ చేయనున్నారు. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఈ ప్రకియ్రలో పాల్గొంటారు. పరిశీలన తర్వాత జాబితాలకు ప్రభుత్వం నుంచి అప్రూవల్ తీసుకుని ఈ నెల 7న ప్రతి ఒక్కరి పేర బ్యాంకు ఖాతా తెరుస్తారు. అకౌంట్లు తెరిచిన వెంటనే ప్రభుత్వం యూనిట్లు మంజూరు చే స్తుంది. ఒక్కో లబ్ధిదారు ఖాతాలో రూ.9.90 లక్షలు జమ చేస్తారు. మిగతా రూ.10వేలు రక్షణ నిధి కింద జిల్లా కలెక్టర్ అకౌంట్లో ఉంటాయి. తర్వాత యూనిట్లపై అవగాహన కల్పించేందుకు లబ్ధిదారులతో సదస్సులు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న యూనిట్కు సంబంధించిన ప్రభుత్వ శాఖ అధికారులను వారికి టయ్యప్ చేసే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మార్చి 7లోగా యూనిట్లను గ్రౌండింగ్ చేయడమే లక్ష్యమని ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి మాధవీలత చెప్పారు.
నియోజకవర్గానికి ఒకరి చొప్పున జిల్లాలో ఐదుగురు ప్రత్యేక అధికారులను నియమిస్తూ జిల్లా కలెక్టర్ బీ గోపి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి జహీరొద్దీన్, పరిశ్రమల శాఖ జిల్లా అధికారి ఎ నర్సింహమూర్తి, సహకార శాఖ జిల్లా అధికారి బి సంజీవరెడ్డి, జిల్లా పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి ఎం బాలకృష్ణ, మత్స్యశాఖ జిల్లా అధికారి పి నరేశ్కుమార్నాయుడు ఉన్నారు. జహీరొద్దీన్ నర్సంపేట, నర్సింహమూర్తి వరంగల్ తూర్పు నియోజకవర్గం, సంజీవరెడ్డి వర్ధన్నపేట నియోజకవర్గంలోని వర్ధన్నపేట, పర్వతగిరి మండలాలు, బాలకృష్ణ పరకాల నియోజకవర్గంలోని గీసుగొండ, సంగెం మండలాలు, నరేశ్కుమార్ పాలకుర్తి నియోజకవర్గంలోని రాయపర్తి మండలంలో స్పెషల్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నారు. దళితబంధు పథకం తొలివిడుత అమలుకు కొద్ది రోజుల నుంచి జరిగిన జిల్లాస్థాయి సమావేశాలకు ఈ ఐదుగురు ప్రత్యేక అధికారులుగా హాజరయ్యారు.