Heat Waves | దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయి. దాంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకుపైగానే నమోదవుతున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్లో వేడిగాలుల కారణంగా వాతావరణశాఖ రెడ్ అలెర్ట్ ప్రకటించింది. బీహార్, జార్ఖండ్లకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. ఇంకా చాలా రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వేడి, తేమతో కూడిన వాతావరణం ఉంటుందని.. బెంగాల్, ఒడిశాలో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. అదే సమయంలో వేడిగాలుల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడక తప్పదన్నారు.
భారత వాతావరణ విభాగం (IMD) సీనియర్ శాస్త్రవేత్త సోమాసేన్ రాయ్.. ఒడిశాలో వడగాలులు వీస్తాయని దాంతో.. పరిస్థితులు అధ్వాన్నంగా ఉంటాయన్నారు. కొద్దిరోజుల పాటు ఇదే పరిస్థితులు ఉండబోతున్నాయని పేర్కొన్నారు. ఇక పశ్చిమ బెంగాల్లో శనివారం గరిష్ఠ ఉష్ణోగ్రత 44.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. చాలా ప్రాంతాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఒడిశాలోని అంగుల్లో 44.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సీజన్లో మొదటిసారిగా 44 డిగ్రీలు దాటిన రాష్ట్ర రాజధాని భువనేశ్వర్లో 44.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రానున్న మూడు రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలో క్రమంగా ఒకటి నుంచి రెండు డిగ్రీల సెల్సియస్ పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలకు పడిపోయాయి.
మళ్లీ సోమవారం నుంచి 40 డిగ్రీలు దాటుతాయని ఐఎండీ పేర్కొంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం, ఢిల్లీ గాలి నాణ్యత కొద్దిగా మెరుగుపడింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 163 వద్ద నమోదైంది. ఆదివారం జమ్మూ కశ్మీర్, తమిళనాడులో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని విదర్భ, ఉత్తర తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్రషం కురుస్తుందని పేర్కొంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, తూర్పు మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్లో ఆదివారం ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.