నయీంనగర్ పెద్దమోరీని పరిశీలిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్
నర్సంపేట/ నయీంనగర్ / ఆత్మకూరు, జూలై 23 :రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీవర్షం పడినా ఎక్కడా ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరుగలేదని, ఇంతకంటే ఎక్కువ వానలు పడినా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన వరంగల్ రూరల్ జిల్లా నర్సంపేట పట్టణ సమీపంలోని మాదన్నపేట చెరువు, ఆత్మకూరు మండలంలోని కటాక్షపురం పెద్దచెరువు మత్తడి, వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ నయీంనగర్లోని పెద్దమోరీ వద్ద వరద ప్రవాహాన్ని పరిశీలించారు. అనంతరం ఎస్బీహెచ్ కాలనీని సందర్శించారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి వెంట చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపునేని నరేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, మేయర్ గుండు సుధారాణి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్గాంధీహన్మంతు, హరిత, కుడా చైర్మన్ మర్రియాదవరెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరంగల్ అర్బన్, రూరల్, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు, వరద పరిస్థితిపై నిరంతరం కలెక్టర్లు, అధికారులతో మానిటరింగ్ చేస్తున్నట్లు తెలిపారు. ఏ విధమైన నష్టం జరుగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆత్మకూరు మండలం కటాక్షపురం పెద్ద చెరువు వద్ద హైలెవల్ బ్రిడ్జి నిర్మాణం ప్రభుత్వం కోసం నిధులు మంజూరు చేసిందని, పనుల ప్రారంభానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తామన్నారు. రూ.8కోట్లతో నయీంనగర్ నాలా వద్ద నూతన బ్రిడ్జి నిర్మిస్తామన్నారు. నీటి ప్రవాహం ఎక్కడా ఆగకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.