ముగిసిన గ్రేటర్ నామినేషన్ల ఘట్టం
ఆఖరిరోజు వెల్లువలా దరఖాస్తులు
టీఆర్ఎస్ తరఫున అత్యధికంగా 706
వరంగల్, ఏప్రిల్ 18 : గ్రేటర్ ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. ఆఖరి రోజు ఆదివారం నామినేషన్లు వెల్లువెత్తాయి. నగరంలో ఏర్పాటు చేసిన రెండు సెంటర్ల వద్ద కోలాహలం నెలకొంది. మూడురోజుల పాటు సాగిన నామినేషన్ల పర్వంలో గ్రేటర్లోని 66 డివిజన్లకు 1,214 మంది అభ్యర్థులు 1,753 నామినేషన్ సెట్లు దాఖలు చేశారు. చివరి రోజు వివిధ పార్టీల నుంచి 1,010మంది అభ్యర్థులు 1,487 నామినేషన్ సెట్లు వేశారు. 66 డివిజన్లలో టీఆర్ఎస్ పార్టీ నుంచి అధిక సంఖ్యలో అభ్యర్థులు నామినేషన్లు వేశారు. తర్వాత బీజేపీ నుంచి దాఖలు చేశారు. తాజా మాజీ కార్పొరేటర్లలో సగం మంది నామినేషన్లు వేయలేదు. రిజర్వేషన్లు కలిసి రాకపోవడంతో వారి కుటుంబసభ్యులతో నామినేషన్ వేయించారు. టీఆర్ఎస్ నుంచి అధిక సం ఖ్యలో 706 సెట్లు, బీజేపీ నుంచి 294, కాంగ్రెస్ నుంచి 247, టీడీపీ నుంచి 21, సీపీఐఎం 14, సీపీఐ 7, ఇతర పార్టీల నుంచి 45, స్వతంత్ర అభ్యర్థులు 419 సెట్లు దాఖలు చేశారు. ఇక ఎల్బీ కళాశాల, ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటు చేసిన నామినేషన్ సెంటర్ల వద్ద కోలాహలం నెలకొంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు. ఉద యం 10.30 గంటలకు ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ రాత్రి వరకు కొనసాగింది. సాయంత్రం 5 గంటల వరకు డిపాజిట్లు చెల్లించిన వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులు స్వీకరించారు.
డిపాజిట్ల చెల్లింపులో గందరగోళం
నామినేషన్ డిపాజిట్ల చెల్లింపులో గందరగోళం నెలకొంది. మొదటి నుం చి నామినేషన్ కేంద్రాల వద్దనే ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి డిపాజిట్ డబ్బులు తీసుకున్నారు. ఆఖరి రోజు పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలిరావడంతో డిపాజిట్ కౌంటర్ల వద్ద తోపులాటలు జరిగాయి. ఇది గమనించిన అధికారులు కార్పొరేషన్కు చెందిన మీసేవ కేంద్రాల్లో డిపాజిట్ డబ్బులు చెల్లించాలని ప్రకటించారు. అయినా, నామినేషన్ సెంటర్ల వద్ద రద్దీ తగ్గలే దు. గడువు దగ్గర పడుతుండడంతో అభ్యర్థులు గొడవకు దిగారు. దీంతో అదనపు ఎన్నికల అధికారి, గ్రేటర్ కమిషనర్ సత్పతి రిటర్నింగ్ అధికారుల కు డిపాజిట్ డబ్బులు చెల్లించాలని తెలిపారు. అభ్యర్థుల నుంచి నేరుగా డబ్బులు తీసుకొని నామినేషన్లు స్వీకరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక కరోనా నేపథ్యంలో నామినేషన్ల సెంటర్ల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులతోపాటు బలపరిచే వారిని మాత్రమే అనుమతించారు. నామినేషన్ కేంద్రానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థర్మల్ స్క్రీనింగ్ చేసి లోనికి పంపించారు.