హనుమకొండ చౌరస్తా/సుబేదారి, సెప్టెంబర్ 19 : ఏఎఫ్ఐ సహకారంతో జేఎన్ఎస్లో ఐదు రోజుల నుంచి సాగుతున్న నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్స్ పోటీలు ఆదివారం ముగిశాయి. చివరి రోజు 10 ఈవెంట్లకు నిర్వాహకులు ఫైనల్స్ నిర్వహించారు. ఆదివారం జరిగిన హామర్త్రో మహిళల విభాగంలో రాజస్థాన్కు చెందిన మంజు బాలా 2వ రికార్డు బ్రేక్ చేసింది. 2002లో న్యూఢిల్లీకి చెందిన హర్దీప్కౌర్ పేరిట ఉన్న ట్రాక్ రికార్డును తిరగరాసింది. అథ్లెట్లు అన్ని ఈవెంట్లలో ప్రతిభను చూపేందుకు తీవ్రంగా పోటీ పడ్డారు. ఇలా మొత్తం 519మంది అథ్లెట్లు 48 ఈవెంట్లలో పాల్గొని పతకాలు సాధించారు.
ఆద్యంతం ఉత్కంఠగా..
ప్రతి ఈవెంట్ అథ్లెట్ల మధ్య పోటీతో ఉత్కంఠగా సాగింది. డెకథ్లాన్(పురుషుల) 10 ఈవెంట్లలో, హెప్టాథ్లాన్(మహిళల) 7 ఈవెంట్లలో చివరివరకు ముందువరసలో నిలిచి పతకం సాధించేందుకు అథ్లెట్లు తీవ్రంగా శ్రమించారు. చివరి రోజు మార్నింగ్ సెషన్లో జరిగిన మహిళల, పురుషుల 10వేల మీటర్ల రన్నింగ్ పోటీ హోరాహోరీగా సాగింది. ఎవరు గెలుస్తారోనని అందరూ ఆసక్తిగా తిలకించారు. పురుషుల 10వేల మీటర్ల ఈవెంట్లో 12మంది అథ్లెట్లు బరిలోకి దిగగా సర్వీసెస్కు చెందిన కార్తీక్కుమార్ స్వర్ణం సాధించారు. మహిళల 10వేల మీటర్ల విభాగంలో ఐదురుగు పోటీపడగా మహారాష్ట్రకు చెందిన సంజీవిని బాబురావు జాదవ్ మొదటి వరుసలో నిలిచి స్వర్ణపతకం గెలుచుకుంది. అలాగే ఈవినింగ్ సెషన్లో పురుషులు, మహిళల హామ్మర్త్రో, పురుషుల ట్రిపుల్ జంప్, మహిళలు, పురుషుల 200 మీటర్లు, మహిళల డిస్కస్త్రో ఈవెంట్లు పోటాపోటీగా సాగాయి. ఇక టోర్నీ చివరి ఘట్టమైన పురుషులు, మహిళల 4×400 మీటర్స్ రిలే ఉత్సాహంగా ముగిసింది.
రికార్డులు.. పతకాలు
జేఎన్ఎస్ వేదికగా అథ్లెట్లు కొత్త చరిత్ర సృష్టించారు. గతంలో నమోదైన రికార్డులను తిరగరాశారు. ఒక్కొక్కరు ట్రిపుల్, డబుల్ ధమాకాలు కొట్టారు. అలాగే ఎంతోమందిని పలు పోటీలకు అర్హత సాధించేలా చేసిన ఈ చాంపియన్షిప్ వారి జీవితంలో మరిచిపోలేనిదిగా నిలిచింది. 800 మీటర్లు, 1500 మీటర్ల విభాగంలో హర్మిలన్ బైన్స్(పంజాబ్) రెండు స్వర్ణాలు సాధించారు. 35 కిలోమీటర్ల రేస్వాక్లో ఉత్తరప్రదేశ్కు చెందిన రాంబాబు రికార్డు బ్రేక్ చేశారు. 59వ నేషనల్స్లో మనీశ్రేవంత్పై ఉన్న రికార్డును తిరగరాశాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ గుంటూరు చెందిన కె.నరేశ్కుమార్ 100 మీటర్ల పరుగుపందెంలో 2వ రికార్డు బ్రేక్ చేశారు. 20 సంవత్సరాల తర్వాత క్రితం నమోదైన 2వ రికార్డును బద్దలుకొట్టి నేషనల్స్ చరిత్రలో నిలిచిపోయాడు. హామర్త్రో మహిళల విభాగంలో రాజస్థాన్కు చెందిన మంజు బాలా 2వ రికార్డు బ్రేక్ చేసింది. 2002లో న్యూఢిల్లీకి చెందిన హర్దీప్కౌర్ పేరిట ఉన్న ట్రాక్ రికార్డును చెరిపేసింది. తమిళనాడుకు చెందిన ఆర్.విత్యరామరాజు మూడు స్వర్ణ పతకాలు గెల్చుకుంది. 400 మీటర్స్, 4×400 మిక్స్డ్ రిలేలో, 400 మీటర్స్ హార్డిల్స్ విభాగాల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించారు. అలాగే ఉత్తర్ప్రదేశ్కు చెందిన పారుల్ చౌదరి 5వేల మీటర్లు, 3వేల మీటర్ల స్టీపుల్ ఛేజ్లో, అలాగే రైల్వేస్కు చెందిన ఐశ్వర్య, లాంగ్జంప్, పోల్వాయుల్ట్లో రెండు స్వర్ణ పతకాలు సాధించడం విశేషం.
ఓవరాల్ చాంపియన్షిప్ రైల్వేస్
ఓవరాల్ చాంపియన్షిప్గా రైల్వేస్ నిలిచింది. వరంగల్ వేదికగా హనుమకొండ జవహర్లాల్ నె హ్రూ స్టేడియంలో జరిగిన 60వ నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ రైల్వేస్ 253.5పాయింట్స్తో ఓవరాల్ చాంపియన్షిప్గా నిలిచింది. మొత్తం 65 ఈవెంట్లలో 519 అథ్లెట్లు పాల్గొనగా రైల్వేస్ నుంచి 43 మంది మహిళా అథ్లెట్లు సహా 87 మందితో రైల్వేస్ బరిలోకి దిగి 157 పాయింట్లతో చాంపియన్షిప్ దక్కించుకుంది. సర్వీసెస్ 187.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.
పురుషుల బెస్ట్ అథ్లెట్గా ప్రవీణ్ చిత్రవెల్(ట్రిపుల్ జంప్, 16.88 మీటర్స్, 1151 పాయింట్స్)
మహిళల బెస్ట్ అథ్లెట్గా హర్మిలన్ కౌర్ బైన్స్(1500 మీటర్స్, 4.05.39, 1163 పాయింట్స్)