BJP | సిద్దిపేట/వినాయక నగర్/సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 25: సిద్దిపేట, నిజామాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ గురువారం నిర్వహించిన సభలు జనం లేక వెలవెలబోయాయి. వేదికలపై నేతలు ఫుల్లుగా ఉన్నా.. సభా ప్రాంగణాలు జనం లేక బోసిపోయాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సిద్దిపేట సభకు ఆలస్యంగా రావడంతో ప్రజలు సభ నుంచి వెళ్లిపోయారు. దీంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. అమిత్షా మధ్యాహ్నం 1:56 నిమిషాలకు సభ వేదికపై చేరుకొని ప్రసంగాన్ని ప్రారంభించి 2:05 నిమిషాలకు ముగించారు. నిజామాబాద్లో నిర్వహించిన సభలో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ ధామి ప్రసంగించే సమయానికి జనం వెళ్లిపోయారు. ఆ సమయంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. ఈ సభలో రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యేలు పైడి రాకేశ్రెడ్డి, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. దీంతోపాటు సహారా ఇండియా బాధితుల నుంచి కూడా నిరసన సెగ తగిలింది. సహారా ఇండియాలో రాష్ట్రం నుంచి చాలా మంది పెట్టుబడులు పెట్టి నష్టపోయారు. అమిత్షా సభ సిద్దిపేటలో ఉందని తెలుసుకొని పెద్దపల్లి, కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, వరంగల్ సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి సహారా ఏజెంట్లు, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సహారా ఇండియాలో పెట్టుబడులు పెట్టి నష్టపోయామని, తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
తెలంగాణను కాంగ్రెస్ ఏటీఎంగా మార్చుకుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా ఆరోపించారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో బీజేపీ మెదక్ పార్లమెంట్ విజయ సంకల్పయాత్ర సభ జరిగింది. ఈ సభలో అమిత్షా ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని, ప్రజలు 12 ఎంపీ సీట్లు ఇచ్చి మోదీని ప్రధానిగా చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పారు.