వనపర్తి రూరల్, జూన్ 24 : జిల్లాలోని క్షయవ్యాధి గ్రస్తులను శాంపిల్స్ సేకరించి సరైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజారోగ్యశాఖ అధికారి రవిశంకర్ అన్నారు. గురువారం జిల్లా ఆరోగ్య వైద్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన క్షయ వ్యాధిగ్రస్తుల శాంపిల్స్ సేకరణ అనంతరం అవగాహన సమీక్షలో ఆయన మాట్లాడారు. 104 సంచార వాహనం గ్రామాల్లో సందర్శించి ఆర్టీపీసీఆర్ శాంపిల్స్ సేకరిస్తున్న సందర్భంలోనే క్షయ వ్యాధికి సంబంధించిన శాంపిల్స్ను కూడా సేకరించి టీబీ సెంటర్కు అందించాలన్నారు. క్షయ వ్యాధి పరీక్షలను నిర్వహించేందుకు ప్రత్యేకంగా ఇద్దరు ల్యాబ్ టెక్నిషియన్స్లను డిప్యూటేషన్ ఇచ్చారన్నారు. అధునాతమైన మైక్రోస్కోప్ పరికరాన్ని కూడా అందించినట్లు తెలిపారు.
అలాగే డీఎంహెచ్వో ఆదేశాలనుసరంగా ప్రతి గ్రామం నుంచి ఆశ కార్యకర్తలు ప్రతి రోజు గ్రామంలో ఇంటింటి సర్వే నిర్వహిస్తూ కనీసం 10 తగ్గకుండా శాంపిల్స్ను తీసుకోని రావాలన్నారు. కార్యక్రమంలో టీబీ కో- ఆర్డినేటర్ జోషి, మహేశ్, మద్దిలేటి పాల్గొన్నారు.