మొదటగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
2 రౌండ్లలోనే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు
మొదటి రౌండ్లో 19 వార్డులు.. రెండో రౌండ్లో 8 వార్డుల ఫలితం
రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు పరిశీలన
అదనపు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణ
జడ్చర్ల టౌన్, మే 3 : జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపును అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. జడ్చర్లలోని బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో సోమవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియను ప్రారంభమైంది. కొవిడ్ నిబంధనల మేరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. మొదటగా కౌంటింగ్కు హాజరైన అభ్యర్థులు, ఏజెంట్లు, కౌంటింగ్ సిబ్బందిని ఒక్కొక్కరి కొవిడ్ నెగెటివ్ రిపోర్టు, కౌంటింగ్ పాస్లను తనిఖీ చేసి మాస్కులు, ఫేస్షీల్డ్లు, గ్లౌజులు ధరించిన వారిని కౌంటింగ్ కేంద్రంలోకి అనుమతించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పోలీసులు ఒక్కొక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి అనుమతించారు. స్ట్రాంగ్ రూంలో నుంచి బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ హాళ్లలోకి తరలించారు. మొత్తం 5 కౌంటింగ్ హాళ్లలో 19 టేబుళ్లలో కౌంటింగ్ కొనసాగింది. మొదటి రౌండ్లో జంబ్లింగ్ పద్ధతిలో 1, 2, 4, 5, 7, 8, 10, 11, 13, 14, 16, 17, 19, 20, 22, 23, 25, 26, 27 వార్డులకు సంబంధించి ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మొదటగా పోస్టల్ బ్యాలెట్ను లెక్కించగా మొత్తం 11 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. వీటిలో టీఆర్ఎస్కు 9, బీజేపీకి 1, స్వతంత్ర అభ్యర్థికి ఒకటి వచ్చింది. మొదటి రౌండ్ ఫలితాలు ఓట్ల లెక్కింపు రెండు గంటల వ్యవధిలో వెలువడ్డాయి. ఆ తర్వాత రెండో రౌండ్లో 3, 6, 9, 12, 15, 18, 21, 24 వార్డులకు సంబందించిన ఓట్ల లెక్కింపును మొదలెట్టారు. రెండో రౌండ్లో 5 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించగా టీఆర్ఎస్కు 3, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థికి ఒక్కొక్కటి చొప్పున వచ్చాయి. జిల్లా అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పర్యవేక్షణలో కౌంటింగ్ కొనసాగింది. కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు సుదర్శన్రెడ్డి, జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కౌంటింగ్ ముగిసే వరకు కేంద్రంలో ప్రక్రియను పర్యవేక్షించారు. వార్డుల వారీగా విజయం సాధించిన అభ్యర్థులకు కౌంటింగ్ రిటర్నింగ్ అధికారులు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. జడ్చర్ల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొత్తం 27 వార్డులకు ఎన్నికలు నిర్వహించగా 23 వార్డుల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు, 2 వార్డుల్లో కాంగ్రెస్, మరో రెండు వార్డుల్లో బీజేపీ అభ్యర్థులు గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. కౌంటింగ్ ప్రక్రియలో మున్సిపల్ కమిషనర్ సునీత, తాసిల్దార్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.