అచ్చంపేట, మార్చి 23: అచ్చంపేట ప్రాం తంలోని ప్రతి గుంటకూ సాగునీరు అందిం చి సస్యశ్యామలం చేస్తామని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. అచ్చంపేట ప్రజల చిరకాల ఆకాంక్షను నేరవేర్చిన సీఎం కేసీఆర్కు నియోజకవర్గ రైతుల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు విప్ బాలరాజు ప్రకటించారు. సోమవారం అచ్చంపేట క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బల్మూర్ చెరువులో 3 టీఎంసీల నీరు నిల్వ ఉండేలా చేస్తామన్నారు. ఏదుల రిజర్వాయర్ నుంచి బల్మూర్ చెరువు, అక్కడి నుంచి చంద్రసాగర్ను నింపి అమ్రామాద్, పదర మండలాలకు సాగునీరు అందించేందుకు గానూ మన్ననూర్ వద్ద 1.5 టీఎంసీల రిజర్వాయర్ నిర్మించనున్నట్లు తెలిపారు. బల్మూర్లో నిర్మించే రిజర్వాయర్కు ఉమామహేశ్వరం, మన్ననూర్లో నిర్మించే రిజర్వాయర్కు రాయలగండి లక్ష్మీచెన్నకేశవస్వామి పేరున నామకరణం చేయడం సంతోషాన్నిచ్చిందన్నారు. మన్ననూర్ నుంచి మద్దిమడుగు నది వరకు రోడ్డును జాతీయ రహదారిగా మార్చడంతోపాటు రెండు రాష్ర్టాలకు రాకపోకలు సాగించేందుకు కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి కృషి చేస్తానని చెప్పారు. భూములు కోల్పోయే రైతులు గొప్ప మనస్సుతో ఆశీర్వదిస్తేనే ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. రైతులు ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తే వచ్చే డిసెంబర్ నాటికి సాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి, వైస్చైర్మన్ గోపాల్నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, రాంబాబు, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సయ్యయాదవ్, నాయకులు రాజేశ్వర్రెడ్డి, లోక్యానాయక్, విష్ణువర్ధన్రెడ్డి, చెన్నకేశవులు, ఖలీల్, విష్ణుమూర్తి, శంకర్మాదిగ, పర్వతాలు, శివశంకర్, వసురాంనాయక్, ధారాసింగ్, తిరుపతియాదవ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.