పరిగి : ఎంపీడీవోలు, ఎంపీవోలు క్షేత్రస్థాయిలో ప్రతిరోజు పర్యటించి పనులు పర్యవేక్షించాలని, తద్వారా పనుల్లో పురోగతి వస్తుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల పేర్కొన్నారు. ప్రతిరోజు కనీసం నాలుగు గ్రామాలను సందర్శించాల్సిందిగా కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఇప్పటివరకు చేపట్టిన వైకుంఠధామాలు, డంపింగ్ యార్డులు, పల్లెప్రకృతి వనాలు, హరితహారం తదితర కార్యక్రమాల పురోగతిపై ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసంపూర్తిగా ఉన్నటువంటి పనులను వారం రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న వైకుంఠధామాల పనులు వేగవంతం చేసేందుకు పంచాయతీరాజ్ ఏఈలతో మండలస్థాయి సమావేశాలు నిర్వహించుకుని పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని వైకుంఠధామాలకు విద్యుత్, నీటి సదుపాయాలు కల్పించాల్సిందిగా సూచించారు.
పల్లెప్రకృతి వనాలు, వైకుంఠధామాల పనులు వేగవంతం చేసి గ్రీన్ ఫెన్సింగ్ చేయాలని చెప్పారు. ప్రతి మండలంలో నిర్దేశించిన మేరకు మొక్కలు నాటాల్సిందిగా కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో గుంతలు తీసే పనులు చేపట్టి శనివారం మొక్కలు నాటి లక్ష్యం పూర్తి చేయలన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని, మొక్కలు నాటిన పూర్తి వివరాలను వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సిందిగా చెప్పారు. గ్రామ కార్యదర్శులు, ఇతర సిబ్బంది చురుకుగా పని చేసేలా ఎంపీడీవోలు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, పనిచేయని వారిపై చర్యలు తీసుకోవాలని లేనియెడల ఎంపీడీవోలపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. వన సేవకులకు సంబంధించిన డబ్బులు వెంటనే చెల్లించాల్సిందిగా ఆదేశించారు. వచ్చే వారం నిర్వహించే సమావేశానికి సూచించిన పనులను పూర్తి చేసుకుని రావాలని, లేని యేడల చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, డీఆర్డీవో కృష్ణన్, వివిధ మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.