షాద్నగర్/కొత్తూరు, ఏప్రిల్8: కొత్తూరు మున్సిపాలిటీలో కారు జోరు పెంచింది. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, చేపడుతున్న ప్రగతితో నాయకులు, కార్యకర్తలు ఉత్సహంగా ముందుకెళ్తున్నారు. సర్కారు పనితీరుకు ఆకర్షితులవుతున్న ప్రజలు సైతం స్వచ్ఛందంగా గులాబీ పక్షాన నిలుస్తున్నారు. సీఎం కేసీఆర్ వరాలు, స్థానికంగా ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ చేసిన అభివృద్ధికి జై కొడుతున్నారు. మరోవైపు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ శ్రేణులు ముందుకెళ్తున్నారు.
నేడు కొత్తూరు ప్రత్యేకం..
నాడు పాలమూరు జిల్లా పరిధిలో ఉన్న కొత్తూరు.. నేడు రంగారెడ్డి జిల్లా పరిధిలోకి రావడంతో ఈ ప్రాంతం ప్రత్యేక స్థానం సంపాదించుకున్నది. పారిశ్రామిక, వ్యవసాయ, రియల్ రంగంలో అగ్రగామిగా నిలుస్తున్నది. వేలాది మంది కార్మికులకు ఉపాధి కల్పతరువుగా మారింది. ఇతర రాష్ర్టాలతో పాటు తెలుగు రాష్ర్టాల ప్రజలు సమీప పరిశ్రమల్లో ఉపాధి పొందుతూ కొత్తూరులో నివాసం ఉంటున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని మిని ఇండియాగా భావిస్తారు. ఉత్తరప్రదేశ్, బీహార్, చత్తీస్ఘడ్, జార్ఖండ్, ఒడిస్సా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్ట్రలకు చెందిన వేలాదిమంది కార్మికులు కొత్తూరు, తిమ్మాపూర్ ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్నారు. అదేవిధంగా ఇక్కడి భూములకు మొదటి నుంచే భారీ డిమాండ్ ఉంది. దీంతో రియల్ రంగం ఓ వెలుగు వెలుగుతున్నది. పేరుమోసిన రియల్ సంస్థలు ఈ ప్రాంతంలో వ్యాపారాన్ని విస్తరించాయి. ఇక్కడి ప్రజలు వాణిజ్య పంటలను సాగుచేస్త్తూ ఆర్థికంగా లబ్ధిపొందుతున్నారు. వీటికి తోడు కొత్తూరు, తిమ్మాపూర్ల మీదుగా రైల్వే మార్గం, జాతీయ రహదారులు ఉండంతో వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందింది. ఇలా ఈ ప్రాంతం నాటి నుంచి నేటి వరకు తన ప్రత్యేకతను చాటుకుంటున్నది.
స్వరాష్ట్రంలో మున్సిపాలిటీగా..
ఉమ్మడి రాష్ట్రంలో పాలమూరు జిల్లాలో కొత్తూరు మండల కేంద్రంగా ఉండేది. జిల్లాకు ముఖద్వారంగా ఉన్నప్పటికీ ప్రజలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరుగలేదు. జంట గ్రామాలుగా కొత్తూరు, తిమ్మాపూర్ పేరు ఉన్నప్పటికీ పాలకులు ఆ గ్రామాల్లో ప్రగతిని పట్టిచుకోలేదు. రెండు గ్రామాల్లో గ్రామ పంచాయతీల పాలన కొనసాగేది. స్వరాష్ట్రం సిద్దించిన అనంతరం రాష్ట్ర సర్కారు కొత్తూరు ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించింది. భవిష్యత్ అభివృద్ధి, ఉపాధి దృష్ట్యా షాద్నగర్ నియోజకవర్గాన్ని రంగారెడ్డి జిల్లాలో విలీనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీఎస్ ఐపాస్ పథకం ద్వారా కొత్తూరు పారిశ్రామిక వాడలో పలు భారీ పరిశ్రమలు పురుడుపోసుకున్నాయి. ఫలితంగా ఉపాధికి కల్పతరువుగా మారింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినప్పటికీ కొత్తూరు ప్రాంత ప్రజలకు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించిన ప్రభుత్వం ఇరు గ్రామాలను కలిపి గత ఏడాది మున్సిపాలిటీగా ప్రకటించి పాలనను ప్రారంభించింది. కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోకి తిమ్మాపూర్, అక్కివానిగూడ, స్టేషన్ తిమ్మాపూర్, కొత్తూరు తాండ, కుమ్మరిగూడ ప్రాంతాలు వస్తాయి. మున్సిపాలిటీలో మొత్తం 12 వార్డులను విభజించారు. 13,964 జనాభాలో 7,424 మంది పురుషులు, 6,540 మంది మహిళలు ఉన్నారు. మొత్తం 8,136 మంది ఓటర్లు ఉన్నారు.
గులాబీ పార్టీ గురి…
కొత్తూరు మున్సిపాలిటీపై టీఆర్ఎస్ జెండాను ఎగురవేసేందుకు ఆ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నారు. గతంలో కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలోనే తిమ్మాపూర్ ఉండేది. ప్రత్యేక గ్రామ పంచాయతీ డిమాండ్తో 2004లో తిమ్మాపూర్ ప్రత్యేక గ్రామ పంచాయతీగా మారింది. నూతనంగా ఏర్పడిన మున్సిపాలిటీలో ప్రతిపక్ష పార్టీకు చెక్ పెట్టేందుకు గులాబీ నేతలు పావులు కదుపుతున్నారు. టీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీలోని 12 కౌన్సిలర్ స్థానాలను టీఆర్ఎస్ ఖాతాలో వేసుకొని మున్సిపల్ పిఠాన్న్ని దక్కించుకునేందుకు కసరత్తు చేస్తున్నారు. మరోవైపు రెండు రోజుల నుంచి కాంగ్రెస్, బీజేపీ నాయకులను టీఆర్ఎస్లోకి క్యూ కట్టారు. స్థానిక ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. ప్రస్తుత ఎంపీటీసీలతో పాటు మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, ఇతర పార్టీల ప్రధాన నాయకులు టీఆర్ఎస్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో మున్సిపాలిటీలో టీఆర్ఎస్ తిరుగులేని శక్తిగా మారుతున్నది. చేరిక జోష్ చూస్తుంటే ప్రతిపక్ష పార్టీలకు అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి ఉండొచ్చని స్థానికంగా పలువురు చర్చించుకుంటున్నారు.