ఇండ్లకే పరిమితమైన జనాలు
స్వచ్ఛందంగా సహకరిస్తున్న వ్యాపారులు
పకడ్బందీగా లాక్డౌన్ అమలు చేస్తున్న పోలీసులు
తాండూరు, మే 18: కరోనాను తరిమికొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన లాక్డౌన్ను సంపూర్ణంగా నిర్వహించేందుకు పోలీసులు ముమ్మర చర్యలు చేపడుతున్నారు. కరోనా కట్టడే లక్ష్యంగా సకల జనులు రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. లాక్డౌన్ సమయంలో కొందరు బయట తిరుగుతుండడంతో పోలీసులు వారిని పట్టుకుని జరిమానాలు, కేసులు నమోదు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంతో తాండూరు, పరిగి, కొడంగల్, పల్లెలో వాణిజ్య సంస్థలు, వ్యాపార దుకాణాలు సర్కార్ నిబంధనలకు అనుగుణంగా మూసేశారు. ఏడో రోజు వికారాబాద్ జిల్లాలో లాక్డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలైంది. తాండూరు ఇప్పటికే డ్రోన్ కెమెరా నిఘాలో ఉండగా వికారాబాద్లో మంగళవారం ఎస్పీ నారాయణ డ్రోన్ కెమెరాతో నిఘాను ప్రారంభించారు. పరిగిలో అడిషనల్ ఎస్పీ రషీద్, ఎమ్మెల్యే మహేశ్రెడ్డి లాక్డౌన్ను పరిశీలించారు.
పరిగిలో డ్రోన్ కెమెరాతో పర్యవేక్షణ
పరిగి, మే 18: లాక్డౌన్ పక్కాగా అమలుచేసేందుకు డ్రోన్ కెమెరాతో పర్యవేక్షిస్తున్నట్లు పరిగి సీఐ లక్ష్మీరెడ్డి తెలిపారు. పరిగిలో నిఘాను పెంచేందుకు డ్రోన్ కెమెరాతో పట్టణన్ని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇండ్లల్లోనే ఉండాలన్నారు. కారణం లేకుండా బయట తిరుగుతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో ఎస్సై క్రాంతి కుమార్ పాల్గొన్నారు.
డ్రోన్ కెమెరాతో ఏరియల్ సర్వే
తాండూరు రూరల్, మే 18 : లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేసేందుకు తాండూరు రూరల్ సీఐ జలంధర్రెడ్డి డ్రోన్ కెమెరాతో ఏరియల్ సర్వే చేయించారు. మండలంలోని కరణ్కోట, గౌతాపూర్ గ్రామాల్లో డ్రోన్ కెమెరా సహాయంతో ఆయా గ్రామాల్లో ప్రజలు ఏంచేస్తున్నారో తెలుసుకున్నారు. లాక్డౌన్ ఉత్తర్వులు ఎవరైనా ఉల్లంఘిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ ఇండ్లలోనే ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్సై ఏడుకొండలు, సిబ్బంది ఉన్నారు.
యాలాల మండలంలో..
యాలాల, మే 18: మండలంలో ఏడో రోజు లాక్డౌన్ పకడ్బందీగా అమలవుతున్నది. ఉదయం నాలుగు గంటలు మాత్రమే వ్యాపార సముదాయాలు తెరుచుకున్నాయి. ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ వారికి అవసరం ఉన్న వస్తువులు కొనడానికి ఆసక్తి చూపారు. ప్రజలు తమకు కావాల్సిన వస్తువులు ముందుగానే సమకూర్చుకోవడం వల్ల ఇబ్బందులు పడడం లేదు. లాక్డౌన్ సమయంలో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. ప్రధాన కూడళ్లతోపాటు పల్లెల్లో సైతం పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. జన సంచారం లేక రోడ్లు నిర్మానుష్యంగా మారిపోయాయి. అనవసరంగా బయట తిరిగే వాహనదారులకు కౌన్సెలింగ్తో పాటు జరిమానాలు విధిస్తున్నారు. పోలీసులు కరోనా నిబంధనల గురించి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. లక్ష్మీనారాయణపూర్ ప్రధాన కూడలి కావడంతో ఎసై సురేశ్ వాహనాల రాకపోకలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఆయనతో హెడ్కానిస్టేబుల్ దస్తప్ప, పీసీలు శ్రీను బలరామ్, నరేశ్ తదితరులు నిఘాలో పాల్గొంటున్నారు.
లాక్డౌన్ నిబంధనలు పాటించాలి
పూడూరు, మే 18: ప్రతిఒక్కరూ ప్రభుత్వం విధించిన లాక్డౌన్ నిబంధనలు పాటించాలని చన్గోముల్ ఎస్సై శ్రీశైలం పేర్కొన్నారు. మండలంలోని మన్నెగూడ, అంగడిచిట్టంపల్లి, సోమన్గుర్తి ప్రాంతాల్లోని హైదరాబాద్- బీజాపూర్ హైవే రోడ్డుపై వాహనాలను తనిఖీ చేశారు. అనుమతులు లేని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో గుంపులు గుంపులుగా ఉంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు. పోలీస్ సిబ్బంది ప్రతి గ్రామంలో నిత్యం పరివేక్షిస్తున్నదని పేర్కొన్నారు.
సంతలో భౌతిక దూరం పాటించాలి
పెద్దేముల్, మే 18: వారంతపు సంతలో కూరగాయల వ్యాపారులు, వినియోగదారులు ప్రతిఒక్కరూ కరోనా దృష్ట్యా భౌతిక దూరం పాటించాలని ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మండల కేంద్రంలో నిర్వహించే వారంతపు సంతలో కూరగాయల వ్యాపారులు, వినియోగదారులకు కరోనా నియంత్రణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మాస్కులు ధరించి, శానిటైజర్లతో చేతులను పరిశుభ్రంగా కడుగుతూ విక్రయాల సమయంలో తప్పకుండా భౌతిక దూరం పాటించాలన్నారు. కొవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే వారిపై జరిమానాలు విధించడంతో పాటు, కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, వ్యాపారులు, వినియోగదారులు పాల్గొన్నారు.
లాక్డౌన్పై ఎమ్మెల్యే ఆరా
పరిగి, మే 18: పరిగిలో లాక్డౌన్ పరిస్థితులను ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అడిషనల్ ఎస్పీ రశీద్, సీఐ లక్ష్మిరెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు అనవసరంగా బయటకు రాకుండా లాక్డౌన్ను అమలుచేయాలని, కరోనా కట్టడికి ఇదే మార్గమని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలో అమలుచేస్తున్న నిర్ణయాలను అడిగి తెలుసుకున్నారు. పరిగిలో లాక్డౌన్ ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు అమలు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ రోడ్లపైకి రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.