రంగారెడ్డి, మే 7 (నమస్తే తెలంగాణ) : లోక్సభ ఎన్నికల్లో వృద్ధులు, దివ్యాంగులు పోలింగ్కు ముందే ఓటేశారు. వీరితోపాటు ఎన్నికల సిబ్బంది సైతం పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నారు. 85 ఏండ్లు దాటిన వృద్ధులు, 40 శాతం వైకల్యం కలిగిన దివ్యాంగులకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోలింగ్ శాతాన్ని పెంచడంలో భాగంగా ఈసీ కల్పించిన ఈ వెసులుబాటును చాలామంది సద్వినియోగం చేసుకున్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో హోం ఓటింగ్కు 1,257 మంది దరఖాస్తు చేసుకోగా..ఈ నెల 5, 6 తేదీల్లో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో 1,096 మంది ఇంటి నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. వయోవృద్ధులు, దివ్యాంగులు ఉన్నచోటుకే అధికారుల బృందాలు వెళ్లి ఓటు వేయించాయి.
ఫెసిలిటేషన్ కేంద్రంలో ఓటు వినియోగం..
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల్లో చర్యలు తీసుకున్నది. పోస్టల్ బ్యాలెట్కు దరఖాస్తు చేసుకుని ఫెసిలిటేషన్ సెంటర్లో ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారు. ఈ ప్రక్రియ ఈ నెల 3న ప్రారంభం కాగా ఎనిమిదో తేదీ వరకు కొనసాగనున్నది. ఈ క్రమంలో జిల్లాలోని ఎనిమిది నియోజకవర్గాల పరిధిలో ఈ నెల 6 వరకు 13,086 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. చేవెళ్ల లోక్సభ పరిధిలో 11,109 మంది పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ వేశారు. వివిధ నియోజకవర్గాల్లోని ఓటింగ్ను పరిశీలిస్తే.. మహేశ్వరం పరిధిలో 1,773 మంది, రాజేంద్రనగర్లో 2,381 మంది, శేరిలింగంపల్లిలో 2,029 మంది, చేవెళ్లలో 1,0 68 మంది, ఇబ్రహీంపట్నంలో 1,918మంది, ఎల్బీనగర్లో 2,349 మంది, కల్వకుర్తిలో 742 మంది, షాద్నగర్లో 786 మంది, పరిగిలో 1,477 మంది, వికారాబాద్లో 1,510 మంది, తాండూరు పరిధిలో 87 మంది ఓటింగ్లో పాల్గొన్నారు.