సిటీబ్యూరో, మే 7 (నమస్తే తెలంగాణ) : వేసవి తాపంతో విలవిలలాడిపోతున్న నగరవాసులపై వరుణుడు ఒక్కసారిగా కుంభవృష్టి కురిపించాడు. ఎండల ధాటి నుంచి ఉపశమనం కలిగినా వాన ఒక్కసారిగా దంచికొట్టడంతో నగర రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై గంటల కొద్దీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. అనేక చోట్ల విద్యుత్ తీగలు తెగిపడి వందల కొద్దీ కాలనీలు అంధకారంలో మునిగిపోయాయి. వాతావరణ శాఖ ఒక రోజు ముందే నగరానికి భారీ వర్ష సూచన చేసినా జీహెచ్ఎంసీ అధికారులు, విద్యుత్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తం కాని ఫలితం నగర వీధుల్లో స్పష్టంగా కనిపించింది. నిమిషాల్లో పరిస్థితిని చక్కదిద్దాల్సిన ఆయా విభాగపు అధికారులు.. కుండపోత వర్షం పడుతున్నా ఎవ్వరూ సహాయక చర్యల్లో పాల్గొనలేదు. దీంతో నగరవాసులకు రోడ్లపై నరకమే కనిపించింది. సహాయక చర్యలపై బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన సన్నద్ధత, ప్రస్తుత ప్రభుత్వం కనబరచకపోవడంపై నగరవాసులు బాహాటంగానే విమర్శలు కురిపించారు.
ముఖ్యంగా సికింద్రాబాద్, చిలకలగూడ, ఓయూ, మారేడుపల్లి, అల్వాల్, ప్యారడైజ్, ఎల్బీనగర్, కాప్రా, సుచిత్ర, జీడిమెట్ల, దిల్సుఖ్నగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా వర్షపునీరు చేరడంతో కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి ఐకియా వరకు, ఖాజాగూడ చౌరస్తా నుంచి డీపీఎస్ వరకు వాహనాల రాకపోకలు స్తంభించాయి. ఐటీ కారిడార్లో వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ముందుకు వెళ్లలేక రోడ్లపై తడుస్తూనే ఉండిపోవాల్సిన దుస్థితి వచ్చింది. ఈదురుగాలులతో పలు చోట్ల చెట్లు విరిగిపడటంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాగా, సికింద్రాబాద్లో అత్యధికంగా 84.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది. కూకట్పల్లిలో 70.8మి.మీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.