ఎటు చూసినా పచ్చని చెట్లు, చల్లని వాతావరణం, జలజల పారే జలపాతాలు చూసేందుకు జనం వికారాబాద్ పట్టణానికి భారీగా తరలి వస్తున్నారు. ముఖ్యంగా సెలవుదినాలు, వారాంతంలో ప్రజల తాకిడి రెట్టింపవుతున్నది. శనివారం అధిక సంఖ్యలో పర్యాటకులు రావడంతో అనంత పద్మనాభస్వామి ఆలయం, అనంతగిరి కొండల పరిసరాలు సందడిగా మారాయి. జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి తదితర జిల్లాల నుంచి కుటుంబ సమేతంగా ఇక్కడకు వచ్చి సరదాగా గడిపారు. చిన్నారులు, పెద్దలు, యువత సెల్ఫీలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ముందుగా అనంతపద్మనాభ స్వామివారిని దర్శించుకున్న భక్తులు ఆ తరువాత అనంతగిరి కొండల్లో ట్రెక్కింగ్ చేస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదించారు. వర్షాలకు మొదలైన వాటర్ ఫాల్స్ను చూసి మైమరిచిపోయారు.