పోచమ్మమైదాన్, జూన్ 13 : వరంగల్ కేంద్ర కారాగారానికి అనుబంధంగా పక్కనే ఉన్న డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిసనర్స్ వరంగల్ రేంజ్ కార్యాలయం (డీఐజీ) హైదరాబాద్కు తరలివెళ్లనుంది. వరంగల్ సెంట్రల్ జైలును మామునూరుకు తరలిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఖైదీలు, పలు రకాల యంత్రాల తరలింపు ప్రక్రియ పూర్తయింది. జైలుకు సంబంధించిన స్థల పత్రాలను కూడా ఆరోగ్యశాఖకు అప్పగించారు. ఈ నేపథ్యంలో డీఐజీ కార్యాలయాన్ని కూడా హైదరాబాద్ హెడ్క్వార్టర్కు తరలించనున్నట్లు తెలుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేకంగా వరంగల్ రేంజ్ కార్యాలయాన్ని వరంగల్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న డీఐజీ రాజేశ్కుమార్ ఐజీగా పదోన్నతి పొంది హైదరాబాద్కు వెళ్లారు. రెండుమూడు రోజుల్లో డీఐజీ కార్యాలయం కూడా హైదరాబాద్ హెడ్క్వార్టర్కు మారనున్నట్లు సమాచారం. కాగా, వరంగల్ సెంట్రల్ జైలులోపల ఉన్న వివిధ రకాల భవనాలు, ఇతర కట్టడాల కూల్చివేత పనులు ఆదివారంతో పూర్తయినట్లు తెలుస్తున్నది. కూల్చివేసిన మట్టిని సోమవారం నుంచి తరలించనున్నారు.