పరిగి: అభివృద్ది నిరంతర ప్రక్రియ అని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెలు, పట్టణాలను అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం ప్రతినెల నిధులు విడుదల చేస్తుందన్నారు. ఎంపీపీ కె.అరవిందరావు అధ్యక్షతన జరిగిన పరిగి మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలోని దళితవాడల్లో అభివృద్దికి రూ.12కోట్ల విలువ చేసే పనులకు ప్రతిపాదనలు పంపించడం జరిగిందన్నారు. నిధులు మంజూరైన వెంటనే ఆయా గ్రామాల్లోని దళితవాడలలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. పల్లె ప్రగతితో గ్రామాలలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందన్నారు.
ఇదే పద్దతిలో పనిచేస్తే రాబోయే కొద్ది సంవత్సరాలలో పల్లెలు పచ్చదనానికి, పరిశుభ్రతకు నిలయాలుగా భాసిల్లుతాయని అన్నారు. 57ఏండ్లు నిండిన అర్హులైన వారందరికీ పించన్లు మంజూరుకు ప్రభుత్వం నిర్ణయించిందని, పరిగి నియోజకవర్గంలో వేలాది మంది పేదలకు కొత్తగా పించన్లు రానున్నాయని తెలిపారు. అర్హులందరికీ ఇటీవలె తెల్ల రేషన్కార్డులు అందజేయడం జరిగిందని, కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుందని అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందని పేర్కొన్నారు.
పాలమూర్-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పరిగి నియోజకవర్గానికి తీసుకువచ్చినందుకు పరిగి మండల అధ్యక్షుడు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై జరిగిన చర్చలో భాగంగా విద్యుత్ స్తంభాలు పూర్తిగా విరిగిన వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తామని చెప్పినా ఇప్పటివరకు మార్చలేదని సర్పంచ్లు అశోక్వర్దన్రెడ్డి, జగన్, నర్సింహ, వెంకటయ్య, రాంచెంద్రయ్యలు పేర్కొన్నారు. వెంటనే విరిగిపోయిన స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయాలని కోరారు.
చిన్న వర్షం కురిసినా రాపోల్ ఫీడర్లో రాత్రంతా కరెంటు సరఫరా నిలిపివేయడం తగదని పేర్కొన్నారు. సమావేశానికి హాజరుకాని వివిధ శాఖల అధికారులపై చర్యలకు జిల్లా కలెక్టర్కు సిఫారసు చేయాల్సిందిగా ఎంపీపీ అరవిందరావు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బి.హరిప్రియ, పీఏసీఎస్ చైర్మన్ కొప్పుల శ్యాంసుందర్రెడ్డి, వైస్ ఎంపీపీ కె.సత్యనారాయణ, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు హఫీజ్, ఎంపీడీవో దయానంద్, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు.