రవీంద్రభారతి, ఆగస్టు 2: రాష్ట్రవ్యాప్తంగా 14లక్షల మంది విద్యార్థుల ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడంతో విద్యార్థుల కష్టాలు చెప్పతరం కావడం లేదని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తంచేశారు. విద్యార్థుల ఉసురు తగిలి రేవంత్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈనెల 7న తరగతుల బహిష్కరణ, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలు, ఆర్డీవో, ఎంఆర్వో కార్యాలయాల ఎదుట నిరసన ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం బషీర్బాగ్ దేశోద్ధారకభవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. నాటి ఉమ్మడి రాష్ట్రంలోని సీఎంలు, తెలంగాణ ఏర్పాటు తరువాత కేసీఆర్ పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంవత్సరానికి 2వేల కోట్లు విడుదల చేశారని కొనియాడారు. కానీ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన నాటి నుంచి సీఎం రేవంత్రెడ్డి పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకోకుండా కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు కావస్తున్నా.. ఫీజు బకాయిలు విడుదల చేయకుండా మొండివైఖరి అవలంబిస్తున్నారని మండిపడ్డారు.
విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆయనకు ఎస్సీ,ఎస్టీ,బీసీ విద్యార్థుల కష్టాలు కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు అనేక నెలలుగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నా.. రేవంత్రెడ్డికి చీమకుకుట్టినట్టుగా కూడా లేదని మండిపడ్డారు. ఈ మూడేండ్లలో నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని, ఆ డబ్బులతో ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంజినీరింగ్ విద్యార్థులను క్రిమినల్స్తో పోల్చడం చూస్తుంటే.. విద్యార్థుల పట్ల రేవంత్రెడ్డికి ఏ అభిప్రాయముందో తెలుస్తుందని తెలిపారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఫీజు రీయింబర్స్మెంట్ను ఎత్తివేయాలని చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. తక్షణమే 8వేల కోట్లు బకాయిలు విడుదల చేయాలని కోరారు. లేకుం టే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని తేల్చిచెప్పారు. కార్యక్రమంలో బీసీ నేతలు నీలం వెంకటేశ్ ముదిరాజ్, అనంతయ్య యాద వ్, సీ రాజేందర్, విద్యార్థి నేతలు పగిళ్ల స తీశ్, రామోదేవ్ మోదీ తదితరులు పాల్గొన్నారు.