భార్య చనిపోయిన విషయాన్ని అతని మనసు అంగీకరించలేదు. అందుకే ఆమె మృతదేహం ఉన్న శవపేటికను పూడ్చిపెట్టడానికి అంగీకరించలేదు. తనకున్న స్టోర్ రూం వంటి గదిలో.. ఆ శవపేటికతోనే సహజీవనం చేశాడు. దాని పక్కనే పడుకొని రాత్రంతా భార్యకు కబుర్లు చెప్పేవాడు. ఇలా 21 ఏళ్లు గడిపిన తర్వాత.. ఏప్రిల్ 30న భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు.
ఈ ఘటన థాయ్ల్యాండ్లో వెలుగు చూసింది. బ్యాంగ్ ఖేన్ జిల్లాలో ఉండే చార్న్ జాన్వాచకల్కు 72 ఏళ్లు. ఆయన భార్య 21 ఏళ్ల క్రితం కన్నుమూసింది. భార్య మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన అతను.. ఆమె ఉన్న శవపేటికతో ఇంతకాలం సహజీవనం చేశాడు. స్థానికంగా ఉండే ఫేట్ కాసెమ్ బ్యాంకాక్ ఫౌండేషన్ సాయంతో తాజాగా భార్యకు అంత్యక్రియలు నిర్వహించాడు.
దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో చార్న్ తన భార్యతో మాట్లాడుతూ.. ‘‘చిన్న పని మీద బయటకు వెళ్తున్నావు అంతేనమ్మా.. కాసేపటి తర్వాత మళ్లీ తిరిగి వచ్చేస్తావు’’ అని చెప్పడం వినిపిస్తోంది. ఆమె చనిపోయినప్పుడే భార్య మరణించినట్లు చార్న్.. ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేయించాడు. అందువల్ల అతను మృతదేహాన్ని దాచినట్లు కాదని, అతనిపై ఎలాంటి కేసు ఉండదని అధికారులు చెప్పారు.