భోపాల్ : మధ్యప్రదేశ్లోని బక్స్వహ ప్రాంతంలోని కచ్చర్ గ్రామంలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ చేతి పంపులో నుంచి నీటితో పాటు మంటలు ఎగిసిపడుతుండటంతో గ్రామస్తులు విస్తుపోతున్నారు. స్ధానికులు ఈ ఘటనను కెమెరాలో రికార్డు చేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. చేతిపంపు నుంచి నీటితో పాటు మంటలు రావడం అద్భుత ఘటన కాదని, దీనివెనుక శాస్త్రీయ కారణం ఉందని అధికారులు, జియాలజిస్టులు చెబుతున్నారు.
స్కూల్ వద్ద ఈ చేతిపంపు ఉందని, గ్రామం అంతటికీ రెండు చేతిపంపులే ఉన్నాయని స్ధానికులు పేర్కొన్నారు. వీటిలో ఓ చేతిపంపులో నీటితో పాటు మంటలు వస్తుండటంతో గ్రామస్తుల మంచినీటి కష్టాలు రెట్టింపయ్యాయి. చేతిపంపులో మంటలు వస్తున్న విషయం గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఇలా ఎందుకు జరుగుతోందని అధికార యంత్రాంగం విచారణ చేపట్టింది. ఈ విషయం ఇప్పుడే తన దృష్టికి వచ్చిందని, దీనిపై ఆరా తీస్తున్నామని బక్స్వహ తహసిల్దార్ జాం సింగ్ చెప్పుకొచ్చారు. అంతకుముందు చేతి పంపు నుంచి మంటలు వచ్చేవని, ఇప్పుడు నీటితో పాటు మంటలు వస్తున్నాయని గ్రామస్తుడు నారాయణ్ యాదవ్ చెప్పారు.
శాస్త్రీయంగా విశ్లేషిస్తే భూగర్భంలో మిథేన్ గ్యాస్ ఏర్పాటవుతుందని, ఇదే ఒక్కొక్కసారి నీటితో కలిసి బయటకు వస్తుందని ప్రొఫెసర్ జేపీ సింగ్ చెబుతున్నారు. మండుతున్న గ్యాస్, నీటితో కలిపి చేతిపంపు నుంచి బయటకు రావడం వింతేమీ కాదని అన్నారు. సాధారణంగా ఇది హైడ్రోకార్భన్ (మిథేన్) గ్యాస్ అని వివరించారు. భౌతిక, రసాయన ప్రక్రియలతో మిథేన్ గ్యాస్ ఏర్పడుతుంటుందని, సమీప ప్రాంతాల్లో ఉండే ప్లాంట్ల వ్యర్ధాల ద్వారానూ ఇది ఏర్పడవచ్చని చెప్పారు. హీటింగ్, బర్నింగ్ ద్వారా సాంద్రత వలన ఈ గ్యాస్ పైకి ఎగదన్నుతుందని దీంతో గ్యాస్ కింద ఉండే భూగర్భ జలాలు పైకి ఎగిసిపడతాయని చెప్పుకొచ్చారు.