కంగనా రనౌత్.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఎన్నో సినిమాల్లో తన నటనకు మంచి మార్కులు పడ్డాయి. లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటించి తన సత్తా చాటింది కంగనా. గత కొన్ని రోజుల వరకు కంగనా అంటే కేవలం ఒక స్టార్ హీరోయిన్గానే అందరికీ తెలుసు. ఒక నటిగానే అందరికీ పరిచయం. కానీ.. కొన్ని రోజుల నుంచి తను వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. చాలా కాంట్రవర్సీలలో తనే హైలైట్ అవుతోంది. రాజకీయాల నుంచి సినిమాల వరకు అన్ని రంగాల్లో తనకు తానే వివాదాలను సృష్టించుకుంది కంగనా. తాజాగా సీపీఐ కార్యదర్శి నారాయణ.. కంగనా వివాదాలపై స్పందించి తను ఒక రిచ్ బెగ్గర్ అంటూ ఫైర్ అయిన విషయం తెలిసిందే. అలా.. కంగనా చిక్కుకున్న కొన్ని వివాదాల గురించి ఓసారి తెలుసుకుందాం రండి.
టైమ్స్ నవ్ సమ్మిట్ 2021లో పాల్గొన్న కంగన.. దేశ స్వాతంత్య్రంపై సంచలన కామెంట్స్ చేసింది. సరికొత్త వివాదాన్ని ఆ సమ్మిట్లో తెర లేపింది. మనకు 1947లో వచ్చింది అసలైన స్వాతంత్య్రం కాదని.. అది అడుక్కుంటే వచ్చిందని వ్యాఖ్యానించింది. భారతదేశ ప్రజలకు అసలైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో అని.. అది కూడా ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో అన్నట్టుగా మాట్లాడింది. ఓ జాతీయ చానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంగనా చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు రాజకీయ వేత్తలు కూడా స్పందించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన సమరయోధులను అవమానిస్తావా? అంటూ తనపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు.
క్రిష్ సినిమా షూటింగ్ సమయంలో 2013లో కంగనా రనౌత్, హృతిక్ రోషన్ మధ్య రిలేషన్షిప్ ఉన్నట్టుగా కంగనా తెలిపింది. కానీ.. హృతిక్ మాత్రం తన వ్యాఖ్యలను ఖండించాడు. తమ మధ్య ఏం లేదని చాలా ఇంటర్వ్యూలలో హృతిక్ చెప్పుకొచ్చాడు.
కేంద్ర ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చినప్పుడు ఢిల్లీ దగ్గర రైతులు ధర్నా చేసిన విషయం తెలిసిందే. వేలల్లో రైతులు ధర్నాలు చేస్తుంటే మీడియా కవరేజ్ ఎందుకు లేదు.. అంటూ బార్బేడియన్ సింగర్ రిహాన్నా ట్వీట్ చేయగా.. తన ట్వీట్కు రిప్లయి ఇచ్చిన కంగనా.. వాళ్లు రైతులు కాదు.. ఈ దేశాన్ని విడదీసే ఉగ్రవాదులు అంటూ చెప్పుకొచ్చింది.
2020లో ముంబైలో ఉండి.. ముంబై గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా. ముంబై, పాకిస్థాన్ ఆక్రమించిన కశ్మీర్లా ఉందని పోల్చింది. అది ముంబై వ్యాప్తంగా పెద్ద దుమారమే రేపింది. కంగనా వ్యాఖ్యలపై ఏకంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే స్పందించారు. అదే సమయంలో ముంబైలోని కంగనా ప్రొడక్షన్ హౌస్ నిర్మాణం చట్టవిరుద్ధం అంటూ బీఎంసీ అధికారులు నోటీసులు పంపించారు. ఆ నోటీసులకు కంగనా రెస్పాండ్ కాకపోయేసరికి.. చట్టవిరుద్ధంగా నిర్మించిన నిర్మాణాన్ని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. తర్వాత బీఎంసీ చర్యపై బాంబే హైకోర్టు స్టే విధించింది.
సుశాంత్ సింగ్ రాజ్పుత్ చనిపోయిన తర్వాత ఆయన మరణంపై కూడా కంగనా షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. సుశాంత్ సింగ్కు ఇండస్ట్రీకి చెందిన కొన్ని డర్టీ సీక్రెట్స్ తెలుసు అని.. అందుకే సుశాంత్ను చంపేశారంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ బిగ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్పై నెపోటిజం ముద్ర వేసింది కంగనా. నిజానికి.. 2010లో కంగనా రనౌత్ మొదటిసారి కాఫీ విత్ కరణ్ షోలోనే బుల్లితెరకు పరిచయం అయింది. కానీ.. ఆయనపై కూడా ఆరోపణలు చేసింది. ఇండస్ట్రీలో నెపోటిజాన్ని కంటిన్యూ చేస్తోంది కరణ్ జోహారే అంటూ కంగన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి.
బాలీవుడ్ మొత్తం డ్రగ్స్ ఉపయోగిస్తుందని అప్పట్లో కంగనా ఓ ట్వీట్ చేసింది. అందుకే.. బాలీవుడ్ స్టార్ హీరోలందరూ డ్రగ్స్ టెస్ట్ చేయించుకోవాలంటూ డిమాండ్ చేసింది.
బాలీవుడ్ ఇండస్ట్రీలో స్వర భాస్కర్, తాప్సీ పన్ను.. ఇద్దరూ బీ గ్రేడ్ హీరోయిన్లు అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. సోనమ్, దియాను మాఫియాతో పోల్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
pushpaka vimanam | పుష్పక విమానం మూవీ రివ్యూ
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
RRR : చేతులు లేకున్నా ఎన్టీఆర్, చరణ్ స్టెప్స్ను దింపేసింది.. ఆర్ఆర్ఆర్ టీమ్ ఫిదా