Dangerous Tourist Places | అక్కడ.. ఊపిరి బిగబట్టేంత ఉత్కంఠ. రక్తం గడ్డకట్టుకుపోయేంత చలి. ఒంటికి చెమటలు పట్టేంత భయం. ఒక్క అడుగు తప్పినా పాతాళానికే ప్రయాణం. చిన్న అంచనా తారుమారైనా ప్రాణాలు గాల్లోనే. అయినా సరే అక్కడికే ప్రయాణిస్తామంటున్నారు సాహస యాత్రికులు. అంతేనా, డేంజర్ బెల్స్ తమకు సంగీతంలా వినిపిస్తాయంటున్నారు. అత్యంత ప్రమాదకర ప్రదేశాలకు యాత్రలు చేయడం ప్రపంచ వ్యాప్తంగా ఓ ట్రెండ్. ఇటీవల, టైటానిక్ షిప్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన ఐదుగురు బిలియనీర్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అలాంటి భీతిగొలిపే సాహస యాత్రలు ఏం ఉన్నాయో తెలుసుకుందాం. వర్చువల్గా అక్కడికి వెళ్లొద్దాం.
సముద్రంలోని పెద్ద పెద్ద అలల మధ్య ప్రయాణమే భయానకంగా అనిపిస్తుంది. కానీ సాహస యాత్రికులకు అదీ చప్పగానే ఉంటుంది. అందుకే అట్లాంటిక్, పసిఫిక్ మహా సముద్రాలు కలిసే చోట.. విపరీతమైన ఒత్తిడి ఉండే ప్రాంతంలో కోరికోరి ప్రయాణిస్తున్నారు. రెండు మహాసముద్రాల నీళ్లు ఢీ కొట్టుకొని అంతెత్తున అలలు ఎగసిపడుతుంటాయి. ప్రచండమైన గాలుల తీవ్రతకు భారీ నౌకలు కూడా అతలాకుతలం అవుతుంటాయి. నీటి ప్రవాహవేగం ఊహకందనంత ఉద్ధృతంగా ఉంటుంది. అందుకే, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన నీటి ప్రవాహంగా దీనికి పేరుంది. ఒక సముద్రపు నీరు వేడిగా, మరో సముద్రపు నీరు చల్లగా ఉండటం వల్ల అప్పుడప్పుడూ తుపానులూ ఏర్పడుతుంటాయి. ద డ్రేక్ పాసేజ్గా పిలిచే ఈ దారి 800 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని గుండా ప్రయాణించేందుకు రెండు రోజులు పడుతుంది. ఈ దారి గుండా వెళ్లిన ప్రతి నలుగురిలో ఒకరు భీతావహమైన సముద్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంటారు. అయినా సరే అంటార్కిటిక్ మంచు ఖండాన్ని చూడాలనుకునే యాత్రికులు ఈ సాహసయాత్రను ఏరికోరి ఎంచుకుంటున్నారు.
అంతెత్తున కొండ మీది నుంచి తాడుతో కిందకి దూకే బంగీ జంప్ గురించి వినే ఉంటారు. మామూలుగా ఎవరికైనా అలాంటివి చూస్తేనే గుండె గతుక్కుమంటుంది. ‘ఊరికే అలా విసిరేసినట్టు గాలిలో ఎగిరితే, మజా ఏం ఉండదు బాస్’ అంటారు సాహసికులు. అలాంటి వాళ్ల కోసం మరో అత్యంత సాహసభరిత కార్యక్రమం ఉంది. భూమికి వేల అడుగుల ఎత్తులో ఉండే కొండ మీది నుంచి మొసళ్లతో నిండిన కొలను పైకి బంగీ జంప్ చేయడం అన్నమాట. అంటే, అంత ఎత్తునుంచి విసురుగా ఆ మొసళ్లు ఉండే కొలను మీదకి దూకి మళ్లీ వెనక్కి వస్తారన్నమాట. ఈ తరహా అనుభవం కోసం జాంబియా జింబాబ్వే దేశాల మధ్య ఉండే విక్టోరియా జలపాతాలకు వెళ్తారు సాహసయాత్రికులు. 365 అడుగులకు పైగా ఎత్తు నుంచి అక్కడి జాంబెజి నదిలోకి బంగీ జంప్ చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన బంగీ జంపుల్లో ఇదొకటి. ఇక ఇక్కడి నదినిండా మొసళ్లే. నది అంచుల దాకా తాడు వెళుతుంది. ఇటీవల ఒకామె అలా దూకినప్పుడు తాడు తెగి నదిలో పడిపోయింది. నీళ్లలో ఉన్న మొసళ్లనూ చూసింది. కానీ ఈత రావడంతో బతికి బట్టకట్టింది. అయినా సరే, బంగీ జంప్ చేసేవారి సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు.
అగ్ని పర్వతం బద్దలైతే.. అందులో నుంచి నిప్పు కణికలు ఎగజిమ్మి నేల మీద ప్రవహిస్తుంటే.. దరిదాపుల్లోకి వెళ్లాలన్నా వెన్నులో వణుకుపుట్టడం ఖాయం. కానీ, ‘అబ్బే మాకలాంటివేవీ లేవు… అలా ప్రవహించే లావా మీద పనీర్ గ్రిల్ చేసుకుంటాం’ అనడమే కాదు, చేసి చూపిస్తున్నారు కూడా ఎక్స్ట్రీమ్ టూరిస్టులు. ఫిలిప్పీన్స్లోని లుజాన్ ద్వీపంలో ఎప్పటికప్పుడు చిన్న చిన్న అగ్నిపర్వతాలు బద్దలవుతూనే ఉంటాయి. అయితే వీటిని దగ్గరి నుంచి చూసేందుకు వందల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. అత్యంత ప్రమాదకరం అని తెలిసినా సరే.. జనం ఇలాంటి చోట్లకి వెళ్లడానికి కారణం చిత్రమైన అనుభవాలకు గురైనప్పుడు మెదడు అడ్రినలిన్ అనే హార్మోన్ని విడుదల చేయడమే. దీనివల్ల మనసు ఆనందానుభూతిని పొందుతుంది. అందుకే ఈ టూరిజాన్ని ‘అడ్రినలిన్ టూరిజం’ అనీ పిలుస్తున్నారు.
నేలనూ, నింగినీ ఏకం చేసే.. సుడిగాలులు టొర్నడోలు. వాటి వెంటా పడుతున్నారు కొందరు సాహసికులు. టొర్నడోలకు పెట్టింది పేరైన అమెరికాలో ఈ తరహా టూర్లు భారీగా సాగుతున్నాయి. టొర్నడో చేజింగ్, స్టార్మ్ చేజింగ్ పేరిట ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఈ యాత్రలను ఏర్పాటు చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఇందులో వాతావరణ పరిస్థితులను అంచనా వేసే నిపుణులు ఉంటారు. టొర్నడోలు ఎక్కడెక్కడ ఏర్పడుతున్నాయి, ఎంత దగ్గరికి వెళ్లచ్చు.. అనేది అంచనా వేస్తూ అత్యంత సమీపం నుంచి ఆ అతిపెద్ద సుడిగాలుల్ని చూపిస్తారు. ఇందుకోసం వారం రోజుల పాటు నాలుగైదు వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తారు. టూర్ల ఖరీదూ లక్షల్లోనే ఉంటుంది. ఒక వేళ టొర్నడోల్లో పడి కొట్టుకుపోయినా, దెబ్బలు తగిలినా కుటుంబానికి ఇబ్బంది లేకుండా ఎనభైలక్షల దాకా ఇన్సూరెన్సు చేస్తుంది కంపెనీ.
‘ప్రమాదాలు జరిగే స్థలం’ అని రాసున్న బోర్డు కనిపిస్తేనే క్లచ్ మీద కాలు బ్రేక్ మీద వేస్తాం. కానీ సాహస యాత్రికులు ఇందుకు భిన్నం. చేస్తే గీస్తే ప్రమాదకర రోడ్డులోనే ప్రయాణం చేయాలంటారు. అలాంటి ఓ రక్త మార్గం.. బొలీవియాలో ఉంది. ఈ దేశ రాజధాని లాపాజ్, కొరాయికో పట్టణాల మధ్య 70 కిలోమీటర్ల రహదారిని ‘ద డెత్ రోడ్’గా పిలుస్తారు. లోతైన లోయలు, ఎత్తయిన కొండలు, దోవ కనిపించనివ్వని మబ్బులు, ఇరుకు దారులు, అనూహ్యమైన మలుపులు.. ఈ దారిలో ఏడాదికి మూడు వందల మంది దాకా చనిపోయేవారట గతంలో. ఇందులో అంత ప్రమాదం ఏమిటో చూద్దామని వెళ్తున్నారు సాహస యాత్రికులు. ఇటీవల కొన్ని భద్రతా పరమైన ఏర్పాట్లు చేయడం, పరిమితి మేరకే వాహనాలను అనుమతించడం, ఈ ఊళ్ల మధ్య మరో రోడ్డును కూడా వేయడం వల్ల మరణాల సంఖ్య కాస్త తగ్గింది కానీ, ఈ అనుభవాన్ని రుచి చూడాల్సిందే అనుకునేవాళ్లు మాత్రం తగ్గేదేలే అంటున్నారు.
“No Rain Village | ఈ గ్రామమే ఒక అద్భుతం.. ఇక్కడ వర్షం పడదు.. కానీ మేఘాలను చేతితో తాకవచ్చు”
“Hyderabad | హైదరాబాద్ నుంచి ఒక్కరోజులో తిరిగొచ్చే ఈ టూరిస్ట్ స్పాట్స్ తెలుసా !”