తిరుమల : కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల ( Tirumala ) శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునే భక్తులకు టీటీడీ నవంబర్ నెల ( November Quota ) దర్శనం, గదుల కోటా తేదీల వివరాలను ప్రకటించింది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లయిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ కు సంబంధించిన కోటాను ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తున్నట్లు అధికారులు వివరించారు.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చని సూచించారు. ఈ టికెట్లు పొందిన భక్తులు ఈనెల 20 నుంచి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయని వివరించారు.
21న ఆర్జిత సేవా టికెట్ల విడుదల
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, పుష్పయాగం టికెట్లను 21న ఉదయం 10 గంటలకు, వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తామని వెల్లడించారు. 24న అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను ఉదయం 10 గంటలకు, శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను ఉదయం 11 గంటలకు విడుదల చేస్తామని వివరించారు.
వృద్ధులు, దివ్యాంగుల దర్శన కోటా
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
25న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25న ఉదయం 10 గంటలకు, తిరుమల, తిరుపతిలలో మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తామని పేర్కొన్నారు. భక్తులు https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా మాత్రమే శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు కోరారు.