Prashant kishor | ఒకే ఒక్క సమావేశం కాంగ్రెస్ను అధోగతి పాలుచేయగా, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కొత్త ఊపిరి పోసింది. మేఘాలయాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగిలింది. 17 మంది ఎమ్మెల్యేల్లో ఏకంగా 12 మంది తృణమూల్ కాంగ్రెస్లోకి జంప్ అయ్యారు. దీంతో ఆ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. బెంగాల్లో రాజకీయ విజృంభణం తర్వాత మమతా బెనర్జీ ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో సైద్ధాంతిక రాజకీయాలు పనిచేయవు. దీంతో కాంగ్రెస్ చాలా రోజులుగా అక్కడ పాతుకుపోయింది. ఇదే తరహాలో పాగా వేయాలని మమతా బెనర్జీ కూడా ప్లాన్ వేశారు. ఇందుకోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ( PK ) మమతకు పూర్తిగా వెన్నదన్నుగా నిలుస్తున్నారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నిలక తర్వాత రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆలోచిస్తున్నానని పీకే సంచలన ప్రకటన చేశారు. కొన్ని రోజుల పాటు సైలెంట్గా ఉన్నారు. అయితే హఠాత్తుగా యాక్టివ్ కావడం, యాక్టివ్ అవ్వడమే కాంగ్రెస్పై పంజా విసరడంతో మళ్లీ దృష్టంతా ఆయనపై పడింది.
మేఘాలయాలో కాంగ్రెస్కు భారీ షాక్ తగలడం వెనుక ప్రధాన పాత్ర పోషించింది ప్రశాంత్ కిశోరే . ఈ విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఈ ఘట్టానికి ప్రధాన సూత్రధారిగా నిలిచిన ముకుల్ సంగ్మాయే వెల్లండించారు. ‘‘ప్రశాంత్ కిశోర్ నాకు స్నేహితుడు. ఆయనతో భేటీ కావడం చాలా ఆనందంగా ఉంది. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాలని చాలా రోజులుగా అధిష్ఠానాన్ని కోరుతూనే ఉన్నాం. అయినా… ఉలుకూ పలుకూ లేనేలేదు.ఇదే విషయంపై చాలా సార్లు ఢిల్లీకి కూడా వెళ్లాం. అధిష్ఠానానికి విన్నవించాం. అసలు పట్టించుకోవడమే లేదు. సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని ముకుల్ సంగ్మా వెల్లడించారు.
ఈశాన్య రాష్ట్రాల్లో తృణమూల్ కాంగ్రెస్కు పెద్దగా బలం లేదు. అయితే ఎలాగైనా కొన్ని రాష్ట్రాల్లో పాగా వేయడం, లేదా ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించాలన్న తహతహతో దీదీ ఉన్నారు. ఇందు కోసం ఆమె కొన్ని రోజులుగా ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలపై కన్నేశారు. దీనికి ప్రశాంత్ కిశోర్ వెనుకుండి తనవంతు పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్రలో భాగమే ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు తృణమూల్ తీర్థం పుచ్చుకోవడం. ఇలా కొ న్ని ప్రాంతాల్లో తన ఉనికిని చాటుకొని, వచ్చే ఎన్నికల నాటికి ఓ కీ రోల్ పోషించాలన్న ఆలోచనలో దీదీ ఉన్నట్లు సమాచారం. అయితే బీజేపీని ఓడించడానికి వచ్చే శక్తులన్నింటినీ కలుపుకొనే వెళ్తానని, ఎవరైనా తమతో చేతులు కలుపొచ్చని కొన్ని రోజుల క్రితం ఆమె బహిరంగ ప్రకటన చేశారు. అంతలోనే కాంగ్రెస్కు ఝలక్ ఇవ్వడం రాజకీయంగా దుమ్ము దుమారాన్నే రేపింది.
రాజకీయాల్లో సరికొత్త ట్రెండ్.. ప్రశాంత్ కిషోర్
Prashant Kishor : బెంగాల్లో పంతం నెగ్గించుకున్న ప్రశాంత్ కిశోర్
బెంగాల్లో మమత ఎంతో మోదీ కూడా అంతే పాపులర్
Corona | ఆ స్కూల్లో 11మంది విద్యార్థులకు పాజిటివ్.. ఎక్కడంటే..?