PoK : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీవోకే)లో ఆందోళనలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనలు 47వ రోజుకు చేరాయి. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునేందుకు నిరసనకారులు సిద్ధమయ్యారు. ఇదే సమయంలో త్వరలో జరగనున్న స్థానిక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నిరసనకారులు ముజఫరాబాద్కు లాంగ్ మార్చ్ ప్రకటించారు.
ఈ నెల 27, సోమవారం లాంగ్ మార్చ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం వేలాది మంది ఆందోళనకారులు రావల్కోట్ చేరుకున్నారు. తమ ఉద్యమాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చనున్నట్లు జేఏఏసీ నేతలు ప్రకటించారు. పాక్ ప్రభుత్వంతో ఇంతకాలం జరిపిన చర్చలు విఫలమయ్యాయని, ఇకపై చర్చలు లేవని కమిటీ కీలక నేత సర్దార్ ఉమర్ నజిర్ శనివారం రాత్రి ప్రకటించారు. ఈ నెల 14 నుంచి చర్చలు జరిగాయని, తమ కమిటీ అడిగిన డిమాండ్లలో ఒక్కటి కూడా నెరవేరలేదని నజిర్ అన్నారు. పైగా తమ ఆందోళనలో పాల్గొంటున్నవారిని తీవ్రవాదులుగా గుర్తిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్ ఇంకా అలాగే ఉందన్నారు. ఇంతకాలం అన్ని రకాలుగా చర్చల కోసం ప్రయత్నించామని, ఇప్పుడు ముజఫరాబాద్కు మార్చ్ నిర్వహించడం ఒక్కటే తమ ముందున్న అవకాశం అన్నారు.
లాంగ్ మార్చ్ నేపథ్యంలో ఉద్యమకారులు భారీ కాన్వాయ్లతో మీర్పూర్ సహా ఇతర ప్రాంతాల నుంచి రావల్కోట్ చేరుకుంటున్నారు. ఇప్పటికే 1,25,000 మంది ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నట్లు అంచనా. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ లాంగ్ మార్చ్ ప్రారంభమవుతుంది. పీవోకేను పాలించుకునే రాజకీయ హక్కు, అధికారం తమకే ఇవ్వాలన్నది అక్కడివాళ్ల ప్రధాన డిమాండ్. పాక్ ప్రభుత్వ జోక్యాన్ని వారు కోరుకోవడం లేదు.