చింతకాని: మండల కేంద్రంలోని చింతకాని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండోరోజూ మరో 83మంది విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించగా ఆరుగురు విద్యార్ధులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. రెండు రోజుల పాటు186మంది విద్యార్ధులను పరీక్షించగా వారిలో మొత్తం11మంది విద్యార్ధులకు పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ అల్లాడి నాగేశ్వరరావు గురువారం తెలిపారు. పాఠశాల సిబ్బందికి సైతం వైద్యులు కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ కరోనా లేకపోవడంతో ఉపాధ్యాయులంతా ఊపిరి పీల్చుకున్నారు.
పాజిటివ్ గా నిర్ధారణ అయిన విద్యార్ధుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి కరోనా మెడిసిన్ కిట్ అందించారు. విద్యార్థులను ఐసోటేషన్లో ఉంచడంతో పాటు పౌష్టికాహారం అందించాలని వైద్యులు సూచించారు. స్ధానిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కరోనా నిర్ధారణ పరీక్షల కేంద్రాన్ని మండల ప్రత్యేకాధికారి, జిల్లా వ్యవసాయశాఖ ఏడీ సతీశ్, ఎంపీడీవో బానోత్ రవికుమార్, ఎంఈవో మోదుగు శ్యాంసన్ కాంప్లెక్స్ హెచ్ఎం కుమ్మర నరసింహరావు తదితరులు సందర్శించి పాఠశాల సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందించారు.