హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): మనిషి జీవితమంతా ప్రాణవాయువును అదించే ఆయువు చెట్టు అని.. మొక్కలను నాటి వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉన్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. మానవ పుట్టుక నుంచి చనిపోయేదాకా చెట్టు తోడు, నీడగా ఉంటుందని చెప్పారు. మొక్కలను పెంచడం కంటే ఉదాత్తమైన కార్యక్రమం ప్రపంచంలో మరేదీ లేదని పేర్కొన్నారు. ఏడోవిడత హరితహారం, మూడో విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ కలాన్ అర్బన్ ఫారెస్ట్పార్క్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా రెండోవేవ్లో ఆక్సిజన్ కోసం యావత్దేశం తల్లడిల్లిపోయిందని.. సకాలంలో ప్రాణవాయువు అందక అనేకమంది చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. పచ్చని చెట్లు మాత్రమే ఈ ప్రాణవాయువును అందిస్తాయని గుర్తుచేశారు. చెట్లను పెంచడంతోపాటు వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నదని చెప్పారు. హరితహారం కార్యక్రమం లాభాపేక్షతో చేసేది కాదని.. ఇంతటి ఉదాత్తమైన కార్యక్రమం మరొకటి ఉండదని స్పష్టంచేశారు. పర్యావరణాన్ని కాపాడుకొనేందుకు, విశ్వమానవాళికి మేలు చేసేందుకు, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమం హరితహారం కార్యక్రమమని చెప్పారు.
ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. ఇప్పటిదాకా ఆరు విడుతల్లో 220 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. ఇందులో ప్రతిఒక్కరూ భాగస్వాములై మొక్కలను పెంచడం, సంరక్షించడం సంప్రదాయంగా స్వీకరించినందునే విజయవంతమయిందని అన్నారు. తెలంగాణ ఏర్పడినపుడు 23-24 శాతం వరకు ఉన్న పచ్చదనం.. ఇప్పుడు 28 శాతానికి చేరుకున్నట్టు కేంద్ర అటవీశాఖ తమ నివేదికలో పేర్కొన్నదని చెప్పారు. పల్లెల్లోనే కాకుండా పట్టణాల్లో కూడా పచ్చదనాన్ని పెంచి, గాలిలో కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో 129 అర్బన్ ఫారెస్ట్పార్కులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
పచ్చదనం కోసం పకడ్బందీ చట్టాలు
హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా ఆమలుచేసేందుకు సీఎం కేసీఆర్ నూతనంగా తెచ్చిన మున్సిపల్, పంచాయతీ చట్టాల్లో కఠిన నిబంధనలు రూపొందించారని మంత్రి కేటీఆర్ చెప్పారు. గ్రీన్బడ్జెట్ కింద బడ్జెట్లో ప్రత్యేకంగా 10 శాతం నిధులు కేటాయించేలా చేశారని తెలిపారు. అంతేకాకుండా 85శాతం మొక్కలు బతకకపోతే స్థానిక కౌన్సిలర్, సర్పంచును పదవినుంచి తొలగించే అధికారం ప్రజలకు కల్పించిన ఘనత కూడా సీఎం కేసీఆర్కే దక్కిందన్నారు. ఇంతటి పకడ్బందీ చట్టాలు చేసినందుకే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం విజయవంతంగా కొనసాగుతున్నాయన్నారు. పచ్చదనాన్ని 33 శాతానికి తీసుకుపోవాలని సీఎం సంకల్పించారని, దీన్ని చేరుకునేందుకు ప్రతిఒక్కరూ తమవంతుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో పెరిగిన గ్రీనరీ: మంత్రి అల్లోల
పల్లెప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాలు తెలంగాణ రాష్ర్టానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయని అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటాలన్నది లక్ష్యం కాగా, గడచిన ఆరేండ్లలో 220 కోట్ల మొక్కలు నాటినట్టు తెలిపారు. ఈ ఏడాదిలో లక్ష్యాన్ని అధిగమించనున్నామని చెప్పారు. హరితహారం కార్యక్రమంతో రాష్ట్రంలో పచ్చదనం 4శాతం పెరిగిందని తెలిపారు. చెట్లను నాటడమే కాకుండా అంతరించిపోతున్న అడవులను కూడా సంరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్లో ఈ తరహా ప్రయోగం విజయవంతంగా అమలుచేశారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తతదితరులు పాల్గొన్నారు.
విశ్వమానవాళికి మేలు చేసేందుకు, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమం హరితహారం. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారు.
హరితహారం కంటే ఉదాత్తమైన కార్యక్రమం మరొకటి లేదు. పర్యావరణాన్ని కాపాడుకొనేందుకు, విశ్వమానవాళికి మేలు చేసేందుకు, భవిష్యత్తు తరాలకు మంచి వాతావరణాన్ని అందించేందుకు చేపట్టిన గొప్ప కార్యక్రమిది. ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టిన ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం.. మొక్కలు నాటడంతోపాటు, సంరక్షించడాన్ని సంప్రదాయంగా తీసుకున్న ప్రజల భాగస్వామ్యంతో విజయవంతంగా కొనసాగుతున్నది.