మినీ ఎన్నికల సంగ్రామంలో ప్రధాన ఘట్టం
తమిళనాడు, కేరళ, పుదుచ్చేరికి ఒకే దశలో పోలింగ్
బెంగాల్లో 31, అస్సాంలో 40 స్థానాలకు కూడా
ముగిసిన ప్రచారం.. పోలింగ్కు ఈసీ అన్ని ఏర్పాట్లు
చెన్నై/తిరువనంతపురం, ఏప్రిల్ 4: మినీ ఎన్నికల సంగ్రామంలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నమైంది. ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తమిళనాడు (234 స్థానాలు), కేరళ (140 స్థానాలు), పుదుచ్చేరి (30 స్థానాలు) శాసనసభల ఎన్నికలకు మంగళవారం ఒకే విడుతలో పోలింగ్ జరుగనున్నది. అలాగే మూడో విడుతలో భాగంగా పశ్చిమ బెంగాల్లోని 31 సీట్లకు, అస్సాంలోని 40 స్థానాలకు కూడా పోలింగ్ నిర్వహిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు సాగించిన ఎన్నికల ప్రచారానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. పోలింగ్ కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
కేరళ పీఠం దక్కేదెవరికి?
వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్తో పాటు దేవభూమిలో పాగా వేయాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీ కారణంగా కేరళలో ముక్కోణపు పోరు కనిపిస్తున్నది. డాలర్, బంగారం కుంభకోణం వంటి అంశాలు అధికార కూటమికి వచ్చే ఓట్లపై ఏమేరకు ప్రభావం చూపుతాయో తెలియాల్సి ఉన్నది. ఈ అంశాలనే లక్ష్యంగా చేసుకొని ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఇటీవల యూపీలో క్రైస్తవ సన్యాసినులపై వేధింపుల వంటి ఘటనలు మైనారిటీ ఓటర్లను బీజేపీకి దూరం చేసే అవకాశమున్నదని.. ఇది అధికార కూటమికి మేలు చేయవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ‘మెట్రో మ్యాన్’ శ్రీధరన్ బీజేపీలో చేరడం ఆ పార్టీకి ఏ మేరకు లాభాన్ని తెచ్చిపెడుతుందో చూడాలని చెబుతున్నారు.
తమిళ తంబి మనసెటో?
ఇద్దరు దిగ్గజ రాజకీయవేత్తలు, దివంగత మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధి లేకుండా తొలిసారిగా ఎన్నికలు జరుగుతుండటంతో అందరి దృష్టి తమిళనాడు రాజకీయాలపై మళ్లింది. గత సంప్రదాయానికి భిన్నంగా రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే మరోసారి అధికారాన్ని చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్నది. ‘అమ్మ (జయలలిత) పరిపాలన’ను కొనసాగించేందుకు మరో అవకాశం ఇవ్వాలని సీఎం కే పళనిస్వామి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్తో జట్టు కట్టిన డీఎంకే నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధ్యక్షుడు స్టాలిన్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించినట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టీటీవీ దినకరణ్ ఏఎంఎంకే, కమల్హాసన్ ఎంఎన్ఎం పార్టీల ప్రభావం పరిమితమేనని చెబుతున్నారు.
పుదుచ్చేరిలో ఆసక్తికర పోరు
బలపరీక్షలో విఫలమైన నారాయణస్వామి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు కుప్పకూలడంతో పుదుచ్చేరిలో రాష్ట్రపతి పాలన విధించారు. డీఎంకేతో కలిసి మళ్లీ అధికారంలోకి రావాలని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ముమ్మరంగా ప్రచారాన్ని నిర్వహించింది. అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. ఇదిలాఉండగా.. మూడోదశలో ఎన్నికలు జరుగనున్న బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ కత్తులు దూసుకుంటున్నాయి. ఇక్కడ కాంగ్రెస్-లెఫ్ట్ కూటమి ప్రచారంలో వెనుకబడింది. అస్సాం తుది విడుత ఎన్నికల్లో అధికార బీజేపీ-అస్సాం గణపరిషత్, కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి, కొత్తగా ఏర్పాటైన అస్సాం జతియా పరిషత్ (ఏజేపీ) మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది.
సాంబార్లో తెలుగు మసాలా
తమిళనాడులో 234 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 15 స్థానాల నుంచి తెలుగు వ్యక్తులు బరిలో ఉన్నారు. అన్నాడీఎంకే నుంచి 10 మంది, డీఎంకే నుంచి ఐదుగురు పోటీ చేస్తున్నారు. ముఖ్యంగా కొలతూరు నుంచి బరిలో ఉన్న డీఎంకే అధ్యక్షుడు, ఎంకే స్టాలిన్పై తెలుగు వ్యక్తి, అన్నాడీఎంకే నేత ఆది రాజారామ్ పోటీ చేస్తున్నారు. శశికళ మేనల్లుడు టీటీవీ దినకరణ్పై అన్నాడీఎంకే నేత, మరో తెలుగు వ్యక్తి ఆర్ఎస్ రాజేశ్ పోటీ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
మహారాష్ట్రలో రాత్రిపూట కర్ఫ్యూ
ఉత్తరాఖండ్లో కార్చిచ్చు.. నలుగురి మృతి