యాదాద్రి, జూన్ 27 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి పుణ్యక్షేత్రం పూర్తి స్వర్ణకాంతులతో ధగధగలాడుతున్నది. అమెరికా, రష్యా దేశాల సాంకేతికతో తయారు చేసిన ప్రత్యేక విద్యుద్దీపాలను అమర్చడంతో ఆలయ లోపలి భాగం పూర్తిగా బంగారు వర్ణాన్ని సంతరించుకున్నది. ఆలయ గర్భాలయ గోడకు పంచలోహంతో తయారు చేసిన ప్రహ్లాద చరిత్ర ఘట్టాలు, గోదాదేవి(ఆండాల్ అమ్మవారు), రామానుజం, ఆళ్వారు, శైన మండపం ఉపాలయాలతో పాటు గతంలో ఏ స్థానంలో ఉన్నాడో క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామికి ఏకతల విమానం నిర్మించి, స్వామివారిని నెలకొల్పి రాతితో నిర్మించిన గర్భాలయం పైభాగంలో విద్యుద్దీపాలు అలంకరించారు. మహా ముఖమండపం కృష్ణశిలలతో 12 మంది వైష్ణవ మతప్రచారకులైన ఆళ్వారులను ఒక్కొక్క పిల్లరుకు సుమారు 40 టన్నులతో కూడిన రాళ్లతో చెక్కారు. ఒక్కో ఆళ్వారులకు ఒక్కో విద్యుద్దీపాలను బిగించారు. మహా మండపంపైన గల కాకతీయ పిల్లర్లకు సైతం లైటింగ్ను ఏర్పాటు చేయడంతో ఆలయం పూర్తిగా బంగారువర్ణంతో ఆకర్షణీయంగా మారింది. రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో లైటింగ్ను ఏర్పాటు చేసి, యాదాద్రిని దర్శించుకునే భక్తులను ఆకట్టుకునేలా ప్రధానాలయాన్ని తీర్చిదిద్దేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.Yada