హైదరాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారంపై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫైర్ అయ్యారు. తనది బహుజన వాదం అని చెప్పుకునే ఈటల రాజేందర్.. తన వాదాన్ని బీజేపీ నాయకుల కాళ్ల ముందు తాకట్టు పెట్టారు. బహుజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే వారితో పాటే కలిసి ఉండేవాడివి కదా? బహజనులంతా ఇవాళ ఆయనను ఛీకొడుతున్నారు. రాజకీయంగా ఆయన సమాధి ఆయనే కట్టుకుంటున్నారు అని పేర్కొన్నారు.
ఈటల కమ్యూనిజం, బహుజన వాదం ఎక్కడ పోయింది? అని ప్రశ్నించారు. మంత్రిగా ఉండి చట్టపరమైన పనులు చేయాల్సిన ఆయన.. చట్ట విరుద్ధంగా అసైన్డ్ భూములను, దేవాదాయ భూములను కొన్నారు. ఈటల మాటలకు.. చేతలకు పొంతన లేదు. ఈటలను సీఎం కేసీఆర్ సొంత తమ్ముడిలా చూసుకున్నారు. సీఎం కేసీఆర్ కీలక పదవులను ఈటలకు కట్టబెట్టారు. ఏనాడైనా పదవి లేకుండా ఈటల ఉన్నారా? పార్టీ నాయకత్వం, నేతలను కించపర్చే విధంగా మాట్లాడటం సరికాదు. ఈటలపై సీఎం కేసీఆర్ సరియైన సమయంలో నిర్ణయం తీసుకుంటారు అని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు.