టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కన్నుమూత

హైదరాబాద్: నాగార్జునసాగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (64) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఇవాళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అపోలో దవాఖానకు తరలించారు. కాగా చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. కాగా, గత కొంతకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. నెలరోజుల క్రితం కరోనా బారినపడ్డారు. అయితే చికిత్స అనంతరం కరోనా నెగెటివ్ వచ్చినప్పటికీ ఆయన కోలుకోలేకపోయారు.
విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి
1956, జనవరి 9న నోముల రాములు, మంగమ్మ దంపతులకు నర్సింహయ్య జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1981లో ఎల్ఎల్బీ, 1983లో ఎంఏ పూర్తిచేశారు. యూనివర్సిటీలో చదువుతున్నప్పటి నుంచే విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పనిచేశారు. సీపీఎం అనుబంధ సంస్థ ఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకుడిగా ఎదిగారు. నల్లగొండ, నకిరేకల్ కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సీపీఎం సీనియర్ నేత నర్రా రాఘవరెడ్డి ప్రోత్సాహంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు.
నకిరేకల్ ఎంపీపీగా 12 ఏండ్లు
1987 నుంచి 1999 వరకు వరుసగా 12 ఏండ్లపాటు నకిరేకల్ ఎంపీపీగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1999, 2004లో నకిరేకల్ నియోజకవర్గం నుంచి సీపీఎం తరఫున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2004 నుంచి 2009 వరకు పార్టీ శాసనసభాపక్ష నేతగా వ్యవహరించారు. 2009లో ఆయన ప్రాతినిథ్యం వహించిన నకిరేకల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ అయ్యింది. దీంతో అప్పుడే ఏర్పడిన భువనగిరి లోసభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయారు. తర్వాత 2014లో టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జానారెడ్డి విజయయాత్రకు బ్రేక్
అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి పోటీచేశారు. కాంగ్రెస్పార్టీ సీనియర్ నేత జానారెడ్డి చేతిలో కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2018లో జరిగిన ఎన్నికల్లో గెలుపొంది.. జానారెడ్డి విజయయాత్రకు బ్రేక్ వేశారు. నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రతో ముందుకు సాగుతున్నారు. నోముల హఠాన్మరణంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
తాజావార్తలు
- కాచిగూడ-యలహంక ప్రత్యేక రైలు
- బ్రాహ్మణుల కోసం అపరకర్మల భవనం: ఎమ్మెల్యే సుధీర్రెడ్డి
- ఓటీపీ వచ్చిందా.. రేషన్ తీసుకో..!
- వైభవంగా పెద జీయర్ స్వామి పరమ పదోత్సవం
- నిఘా కన్ను ఛేదనలో దన్ను
- పేదల సంక్షేమం కోసమే..
- ఆడబిడ్డలకు వరం కల్యాణ లక్ష్మి
- టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అభివృద్ధి
- పేదలను పీడించినా.. మహిళలను వేధించినా.. న్యాయ పోరాటం చేస్తా
- ముమ్మరంగా ఆస్తి పన్ను వసూలు