నైపితా: మయన్మార్ నేత ఆంగ్ సాన్ సూకీ ఇవాళ కోర్టుకు హాజరయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన అక్కడి ప్రభుత్వాన్ని ఆర్మీ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఆమె తొలిసారి కోర్టు విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యారు. తన వ్యక్తిగత న్యాయవాదులతో ఆమె సుమారు 30 నిమిషాలు కోర్టులో ముచ్చటించారు. సూకీ ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆమె లాయర్లు తెలిపారు. జుంటా సైన్యం ప్రభుత్వాన్ని చేజిక్కించుకున్న తర్వాత సుమారు నాలుగు వేల మందిని అరెస్టు చేశారు. 75 ఏళ్ల సూకీని కూడా హౌజ్ అరెస్టు చేశారు. అక్రమ రీతిలో వాకీ టాకీలను కలిగి ఉన్నట్లు సూకీపై ఆరోపణలు ఉన్నాయి. గత నవంబర్ ఎన్నికల్లో ప్రభుత్వం భారీగా అవకతవకలకు పాల్పడిందని, అందుకే ఆ ప్రభుత్వాధికారులను ఆధీనంలోకి తీసుకున్నట్లు ఆ దేశ సైన్యం పేర్కొంటున్నది. సైనిక చర్యను వ్యతిరేకిస్తూ మయన్మార్లో జరుగుతున్న ఆందోళనల్లో ఇప్పటి వరకు 800 మంది మరణించారు.