హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ)/అమీర్పేట్: రాష్ట్రంలో కరోనా కట్టడికి ప్రభుత్వం ప్రత్యేకంగా ట్రేసింగ్ యాప్ను రూపొందించడాన్ని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అభినందించారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పుదుచ్చేరిలో ఉన్న గవర్నర్ ఆదివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్తో ఫోన్లో మాట్లాడారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న క్రమంలో రాష్ట్రంలో పరిస్థితిపై వాకబుచేశారు. వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటూనే ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు గవర్నర్కు మంత్రి ఈటల వివరించారు. కరోనా వ్యాప్తిపై ప్రజలను అప్రమత్తం చేయడానికి ట్రేసింగ్ యాప్ను రూపొందించినట్టు తెలిపారు. ఈ యాప్లో కరోనా ఎవరికి సోకింది? ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్తోపాటు వైరస్ సోకకుండా ఎలా తప్పించుకోవాలి అనే వివరాలన్నీ ఉంటాయని చెప్పారు. ప్రత్యేక యాప్ను రూపొందించడంపై గవర్నర్.. మంత్రిని అభినందించారు. టెస్ట్, ట్రేస్, అండ్ ట్రీట్ చర్యలను ముమ్మరంచేయాలని సూచించారు. ప్రజలు మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించి, విందులు, వినోదాలకు దూరంగా ఉండాలని చెప్పారు. వైరస్ నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజలు సహకరించాలని కోరారు.
ఇవీ కూడా చదవండి…
నీళ్లను కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చని మీకు తెలుసా..?
జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలో సొంత పెట్రోల్ స్టేషన్