హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ): రైతును ఆదుకోవడం కాదు.. వారిని నిండా ముంచడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం. రాష్ట్ర ప్రభుత్వాలు అష్టకష్టాలు పడి వ్యవసాయాన్ని ఒక దరికి తీసుకొస్తే.. కేంద్రం ధాన్యం కొనుగోళ్ల సమయంలో అడ్డగోలు నిబంధనలు పెట్టి, రైతులకు చేజేతులా ఉరి వేస్తున్నది. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే రాష్ట్ర పౌరసరఫరాలశాఖతో ఎఫ్సీఐ కుదుర్చుకునే డీసెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ స్కీం (డీసీపీ) ఎంవోయూలోని మూడో సెక్షన్ మూడో నిబంధన రైతులకు రాష్ర్టాలు మేలు చేద్దామన్నా చేయనివ్వని దారుణ పరిస్థితిని కల్పిస్తున్నది.
(ఏదైనా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ.. మద్దతు ధరను మించి బోనస్ రూపంలో అయినా.. ఆర్థిక ప్రోత్సాహకంగా కానీ రైతులకు చెల్లించినా.. రాష్ట్ర ప్రభుత్వానికి కేటాయించిన మొత్తం కంటే అదనంగా ధాన్యాన్ని సేకరించినా.. అదనంగా పడే భారంతో కేంద్రానికి సంబంధం లేనిదిగా పరిగణించడం జరుగుతుంది.)
దీని అంతరార్థం ఏమిటంటే..మేం చెప్పిన దానికంటే ఎక్కువ కొనొద్దు..మేం నిర్ణయించిన దానికంటే ఎక్కువ ఇవ్వొద్దు.మీ ఇష్టం వచ్చినట్లు కొన్నా.. ఇచ్చినా.. మీ కర్మ.. మాకు ఎలాంటి సంబంధం ఉండదు..ఇదీ కేంద్ర ప్రభుత్వం చెప్తున్న లెక్క. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్బాయిల్డ్ రైస్ తీసుకోబోమని వాళ్లు (కేంద్రం) కరాఖండిగా తేల్చి చెప్తున్నరు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తానుగా కొనుగోలు చేసే ప్రశ్నే ఉత్పన్నం కాదు. ఒకవేళ కేంద్రాన్ని ధిక్కరించి కొనుగోలు చేయడానికి సాహసించినా.. యాసంగిలో మిల్లాడించినప్పుడు నూకల శాతం ఎక్కువగా వస్తుంది. బియ్యం శాతం తగ్గిపోతుంది.
దీనివల్ల మిల్లరు నష్టపోతాడు. కాబట్టి రైతుకు తక్కువ ధర చెప్తాడు. ఈ క్రమంలో రైతుకు, లేదా మిల్లరుకు జరిగే ఈ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం పూడ్చాలి. మద్దతు ధరకంటే ఎక్కువ చెల్లించాల్సి వస్తుంది. ఇదే సమయంలో మద్దతు ధర కంటే ఒక్క పైసా ఎక్కువ ఇవ్వరాదని కేంద్రమే ముంద రి కాళ్లకు బంధం వేస్తున్నది. కేంద్రం పార్బాయిల్డ్ రైస్ కొనదు. ముడిబియ్యం మరాడించి ఇద్దామంటే వచ్చే నష్టాన్ని భరించదు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నని భరిస్తుంది? ధాన్యం సేకరణ మౌలికంగానే కేంద్రం బాధ్యత అయినప్పుడు.. అదనపు నష్టాన్ని రాష్ట్రం ఎందుకు భరించాలి? ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయం కోసం.. రైతులకోసం.. దేశంలోనే ఎవరూ చేయనన్ని పథకాలు అమలుచేస్తున్నది. ఇతర రంగాలను కూడా పరిపుష్టంచేయాల్సిన విధి ప్రభుత్వంపై ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కేంద్రం తన బాధ్యతను తాను విస్మరించి.. రాష్ట్రంపై ఆ భారాన్ని మోపడం వెను క అంతరార్థం రైతును ముంచాలన్నదే కాక ఇంకేముంది? రైతులను నష్టపెట్టడమే కేంద్రం అంతిమ లక్ష్యమని డీసీపీలోని ఈ ఒక్క నిబంధన చెప్పకనే చెప్తున్నది.
ఎఫ్సీఐ కుదుర్చుకొనే డీసీపీ ఎంవోయూలో మూడో నిబంధన ఇది..
‘In the situation of State giving any bonus/ financial incentive, in direct or indirect form, over and above MSP, if the overall procurement of the State is in excess of the total allocation of the State made by the Government of India under TPDS / OWS, such excess quantity shall be treated to be outside the Central Pool’