KCR | కేంద్రంలో మోదీ ప్రభుత్వ పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. ఆయన పాలనలో ఎవరికీ ఒరిగిందేమీ లేదని విమర్శించారు. జగిత్యాలలో ఆదివారం జరిగిన రోడ్షోలో బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నరేంద్ర మోదీ పదేళ్లు అయ్యింది దేశానికి ప్రధాని అయి.. అచ్చేదిన్ వచ్చిందా? అచ్చేదిన్ రాలేదు..కానీ సచ్చేదిన్ మాత్రం వచ్చింది. అడ్డగోలు ధరలు పెరిగిపోయాయి. అమృత్ కాల్ వచ్చిందా? బేటీ పడావో.. భేటీ బచావో వచ్చిందా?’ అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘జన్ధన్ ఖాతాలో డబ్బులు పడ్డయా? జగిత్యాలలో రూ.15లక్షలు వచ్చినయటకదా? మోదీ వచ్చినయని చెబుతున్నడు. జగిత్యాలలో ఎవరికీ రాలేదా?’ అని అనగా.. ‘రాలేదు’ అని చెప్పారు. ‘ఇవాళ భారతదేశ రూపాయి విలువ డాలర్కు వ్యతిరేకంగా చూస్తే.. చాలాహీనంగా రూ.84కి పడిపోయింది. ఎగుమతులు బంద్ అయ్యాయి. దిగుమతులు పెరిగాయి. దేశానికి వందలక్షల కోట్ల అప్పు పెరిగింది. ఏ ఒక్క వర్గానికి కూడా మోదీ హయాంలో న్యాయం జరుగలేదు’ అన్నారు.
‘మీ అందరికీ తెలుసు. భారతదేశంలో ఎక్కడా లేనివిధంగా రైతుబంధు పథకాన్ని పుట్టించి.. దాదాపు ఆరేడు సంవత్సరాల్లో రైతుల ఖాతాల్లో వేసినం. రైతుబంధు రైతులందరికీ? ఏం పడాలి. కాంగ్రెస్ హామీ ఇచ్చిన మేరకు ఏం పడాలి.. మేం రైతుభరోసా ఇస్తం. రూ.7500 ఇస్తం.. సంవత్సరానికి రూ.15వేలు ఇస్తం అన్నరు’ మరి రూ.15వేలు ఇచ్చారా? అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘మొదటి రూ.5వేలే దిక్కులేవు. రేపు మేం పొలం దున్నినోనికే వేస్తం.. చేసిన వాళ్లకే వేస్తం. ఐదెకరాలకు పరిమితం పెడతాం అంటున్నరు. లిమిట్ పెడతా అంటే 20-25 ఎకరాలకు పెట్టాలి. ఐదారు, ఐడెకరాలు, ఎనిమిదెకరాల రైతులు ఏం తప్పు చేశారు. యాసంగి వడ్లన్నీ కొంటున్నరా? నేను వస్తుంటే రోడ్డుపొంట చూసిన ఎక్కడికుప్పలు అక్కడే ఉన్నయ్. రూ.500 బోనస్ వడ్లకు వచ్చిందా? బోనస్ బోగస్ అయ్యిందా? అంటూ విమర్శించారు.
‘కల్యాణలక్ష్మి పథకంలో కేసీఆర్ రూ.లక్ష ఇస్తున్నడు. మేం తులం బంగారం కూడా ఇస్తామన్నరు. ఎవరికైనా తులం బంగారం వచ్చిందా?’ అని ప్రశ్నించగా రాలేదని జనం నినదించారు. ‘మీరంతా అబద్ధం చెబుతున్నరు. జగిత్యాలలో రెండు తులాల వచ్చిందటకదా?’ అని కేసీఆర్ అన్నారు. ‘బంగారం కూడా లేదు. తులం బంగారం తుస్సుమన్నది. మొత్తానికే అరచేతిలో వైకుంఠం చూపించి.. చాలా బ్రహ్మాండంగా మోసగించింది కాంగ్రెస్ ప్రభుత్వం’ అంటూ మండిపడ్డారు. ‘మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నయా? కరెంటు కోతలు మోపైనయా? మరి ఎక్కడికి పోయింది తొమ్మిదేళ్లు వచ్చిన కరెంటు? ఎవరి అసమర్థత ? మంచిగ వచ్చిన మంచినీళ్లు.. పట్టణంలో పేదలకు ఒక రూపాయికే నల్లా కనెక్షన్ ఇచ్చాం. పేదల ఇండ్లలో నల్లాలు పెట్టాం. అందరి ఇండ్లలో గోదావరి నీళ్లు దుంకించాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి ఏం రోగం వచ్చింది? వచ్చిన కరెంటు ఎటుపోయింది ? వచ్చిన మంచినీళ్లు ఎటుపోయినయ్ ? అంటూ నిలదీశారు.
‘చదువుకునే పేద విద్యార్థులకు విదేశాల్లో చదువుకునేందుకు రూ.25లక్షల స్కాలర్షిప్ ఇచ్చాం. దాన్ని కూడా బంద్పెట్టారు. ఫీజు రీయింబర్స్మెంట్ బంద్ పెట్టారు. గురుకులాల్లో కలుషిత ఆహారం తిని విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నరు. మీకు చేనేత కార్మికులు పట్టది. గీత కార్మికులు పట్టది. విద్యార్థులు పట్టది. బీడీ కార్మికులు పట్టరు. కేసీఆర్ కిట్ వస్తుందా? అదీ బంద్పెట్టారు. సీఎంఆర్ఎఫ్ వస్తుందా? సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వస్తలేదు. మరి ఇవన్నీ ఎక్కడికి మాయమైనయ్ ? ఇది ఎట్లున్నదంటే అన్నవస్త్రానికిపోతే ఉన్న వస్త్రం పోయినట్లున్నది. అడుక్కోవడానికి పోతే.. ఉన్నగోషి కూడా గుంజుకున్నట్లున్నది. కొత్త స్కీమ్లు గంగలో కలిసినయ్. ఒక్కటీ అమలుకాలేదు. పాత స్కీమ్లు బంద్పెట్టే దుర్మార్గం జరుగుతుంది. ఐటీలో, పారిశ్రామిక రంగంలో వేలకోట్ల పెట్టుబడులు తెచ్చాం. ఇవాళ పేపర్లలో వార్తలు ఉన్నయ్. ప్లాస్టిక్, అల్యూమినియం ఇండస్ట్రీస్ బేజారవుతున్నయ్. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెబుతున్నరు. రాష్ట్రం పరువు గంగలో కలిసిపోతున్నది’ అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
‘నేను మీ అందరినీ కోరేది ఒకటే.. ఈ దుర్మార్గ ప్రభుత్వం ఏమీ చేయదు. ఇవాళ కొందరు మాట్లాడుతున్నరు. ఏం మాట్లాడుతున్నరు ? బీజేపీకి, కాంగ్రెస్కి పోటీ ఉన్నది? బీఆర్ఎస్కు ఎంపీలు ఎందుకు అని మాట్లాడుతున్నరు ? నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. నాలుగు రూపాయలన్నా చేశారా? ఏమన్న అభివృద్ధి చేశారా? ఇక్కడ అర్వింద్ ఎంపీగా గెలిచిండు. పొద్దున లేస్తే విషం చిమ్మడం తప్ప నాలుగు రూపాయల పని అయ్యిందా? పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిచిండా? మరి వీళ్లకు ఎందుకు ఓటు వేయాలి ? మోదీ చెప్పింది ఏం జరుగదు. ఎంపీలు గెలిచి ఏం చేయరు.. ఈ రాష్ట్రంలో ఒక కేంద్రమంత్రి ఉంటే.. ఐదురూపాయల అభివృద్ధి జరుగదు. దీనికి మీదికేలి మోదీ గవర్నమెంట్ మొత్తం ఝూటా వాగ్ధానాలు’ అంటూ విమర్శలు గుప్పించారు.