Stock Market | గత వారం దేశీయ స్టాక్ మార్కెట్లు పడుతూలేస్తూ సాగాయి. ఆఖరి రోజున భారీ నష్టాల కారణంగా స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. ఓవరాల్గా మదుపరులు.. అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య ఊగిసలాడారు. ఫలితంగానే అంతకుముందు వారం ముగింపుతో చూస్తే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ 147.99 పాయింట్లు పెరిగి 73,878.15 వద్ద స్థిరపడింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 55.90 పాయింట్లు అందుకొని 22,475.85 దగ్గర నిలిచింది. ఈ క్రమంలో ఈ వారం కూడా ఇన్వెస్టర్ల కదలికలు ఏదో ఒక వైపునకే ఉండకపోవచ్చన్న అంచనాలున్నాయి. దీంతో లాభాల స్వీకరణ దిశగా అడుగులు వేసినా..
కొంతమేర కొనుగోళ్లకూ దిగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే మెజారిటీ విశ్లేషకులు.. సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోను కావచ్చన్న సంకేతాలనే ఇస్తున్నారు. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు, విదేశీ సంస్థాగత మదుపరుల పెట్టుబడులు, ఆయా విదేశీ పరిణామాలు సైతం ఈ వారం మార్కెట్ తీరును నిర్దేశించనున్నాయి. నిఫ్టీకి 22,300 పాయింట్ల స్థాయి కీలకమైనదనుకోవచ్చు. దీనికి దిగువన ముగిస్తే 22,000 పాయింట్లు మద్దతు స్థాయిగా చెప్పుకోవచ్చని అత్యధిక నిపుణుల మాట. అయితే సూచీలు పరుగందుకుంటే ఈ వారం 22,600-22,800 మధ్యకు నిఫ్టీ వెళ్లవచ్చని కూడా చెప్తున్నారు.