హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో జాతీయ బ్యాంకుల పరిస్థితులు అగమ్యగోచరంగా, విషమంగా మారనున్నాయి. ఈ నేపథ్యంలో సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సహకార రంగాల విభాగంలో జాతీయ స్థాయిలో ఉత్తమ బ్యాంకుగా టెస్కాబ్, జిల్లాల విభాగంలో కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు ఎంపిక కావడం పట్ల వినోద్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా టెస్కాబ్ చైర్మన్, కరీంనగర్ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ కూడా అయిన కొండూరి రవీందర్ రావును ఆయన మంగళవారం మంత్రుల నివాసంలో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కానున్నాయని, అందులో భాగంగానే జాతీయ బ్యాంకుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుందని వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రజలు, రైతులు సహకార బ్యాంకులను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. సహకార బ్యాంకుల వ్యవస్థ బలోపేతం ద్వారానే ప్రజలు, రైతుల మనుగడ ఉంటుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో జిల్లాల వారీగా ఉన్న సహకార బ్యాంకులన్నింటిని కలిపి రాష్ట్ర స్థాయిలో ఏకైక సహకార బ్యాంకును ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.
ప్రస్తుతం ఉన్న మూడంచెల విధానం బదులు రెండంచెల విధానాన్ని అమలు చేయాలని ఆయన తన అభిమతాన్ని వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో సహకార బ్యాంకులదే భవిష్యత్తు అని ఆయన అన్నారు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు మాట్లాడుతూ సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించామని అన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
అనుమానంతో భార్య గొంతు నులిమి చంపిన భర్త
సింగరేణిలో ఉద్యోగం పొందడం అదృష్టం
“బీఎమ్డబ్ల్యూ సీఈ04” ఫీచర్స్.. అదుర్స్..
అనుమానాస్పద స్థితిలో ట్రాక్టర్ మెకానిక్ మృతి
ట్రాక్టర్ పై నుంచి పడి డ్రైవర్ మృతి