హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణకు వయోపరిమితిని 61ఏండ్లకు పెంచుతూ ప్రభుత్వం చేసిన చట్ట సవరణ మంగళవారం నుంచి అమలులోకి వచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ ఆధికారికంగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఈనెలలో 58 సంవత్సరాల వయస్సు నిండిన వారు పదవీ విరమణ పొందకుండా మరో మూడేండ్ల పాటు ఉద్యోగాల్లో కొనసాగనున్నారు. ఈ నెల 31న 787మంది ఉద్యోగులు, అధికారులు రిటైర్ కావాల్సి ఉంది. రిటైర్మెంట్కు వయోపరిమితిని మూడేండ్లు పెంచుతామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు గతంలోనే హామీ ఇచ్చారు.
ఈ హామీ మేరకు ప్రభుత్వం ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాలలో ‘ది తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్ యాన్యుయేషన్’ చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఉభయసభలు చట్ట సవరణకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ప్రజల ఆయుష్షు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగుల పదవీ విరమణ వయోపరిమితిని పెంచుతున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ చట్ట సవరణ వల్ల నిరుద్యోగ యువతీ, యువకుల ఉపాధికి ఎలాంటి ఆటంకం ఉండదని స్పష్టం చేసింది. ఈ చట్టం అమలు కోసం ఈ నెల 27న రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన గెజిట్ పబ్లికేషన్కు గవర్నర్ ఆమోదముద్ర వేశారు.
యూనివర్సిటీ ఫ్రొఫెసర్లకు మరో రెండేండ్లు?
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును పెంచాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచడంతో ప్రొఫెసర్లకు 65 ఏండ్లకు పెంచే అంశంపై విద్యాశాఖ కమిటీ వేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలోని ప్రభుత్వ యూనివర్సిటీల్లో 850 మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. ప్రస్తుతం వీరి పదవీ విరమణ వయసు 60 ఏండ్లు. రాష్ట్రప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును మూడేండ్లు పొడిగిస్తూ జీవో జారీచేయటంతో వీరి పదవీ విరమణ వయసు 63కు చేరింది. యూజీసీ నిబంధనల ప్రకారం యూనివర్సిటీ ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసు 65 ఏండ్లు అని, గతంలో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ కూడా వయోపరిమితిని 65 ఏండ్లకు పెంచాలని సూచించిందని ప్రొఫెసర్లు అంటున్నారు.
మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్సహా 6 రాష్ర్టాల్లో రిటైర్మెంట్ వయసును 65 ఏండ్లకు పెంచి అమలుచేస్తున్నారని, మనరాష్ట్రంలో కూడా పెంచాలని కోరుతున్నారు. దీనిపై ఓ కమిటీ వేసి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 65 ఏండ్లకు పెంచాలని కోరుతూ ఫెడరేషన్ ఆఫ్ యూనివర్సిటీ టీచర్స్ అసొసియేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ (ఎఫ్యూటీఏటీఎస్) ప్రతినిధులు మంగళవారం విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మంత్రిని కలిసినవారిలో ఎఫ్యూటీఏటీఎస్ ప్రతినిధులు మాధురికుమారి, బీ విద్యాసాగర్, గుంటి రవీందర్, రాజన్న, హనుమంతరావు, సైదానాయక్ తదితరులు ఉన్నారు.
ఇవీ కూడా చదవండి
రాష్ట్రపతికి గుండె శస్త్రచికిత్స
బీహార్లో 2 అగ్ని ప్రమాదాల్లో 9 మంది పిల్లల సజీవ దహనం