హైదరాబాద్, జూన్ 1, (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నామని, వాటిని విక్రయించేవారిపై కఠినచర్యలు తప్పవని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. ఇప్పటికే నకిలీ విత్తన విక్రయాల కట్టడికి వ్యవసాయ, పోలీస్శాఖల అధికారులతో కలిపి మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో టాస్ఫోర్స్ ఏర్పాటుచేసినటు ్టతెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోవద్దన్నదే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మంగళవారం ఆయన రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావుతో కలిసి విత్తన లభ్యత, నకిలీలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ, పోలీస్శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో నకిలీ విత్తన విక్రయాలను సహించేది లేదన్నారు. విత్తన నాణ్యత లోపిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని, నకిలీలను పూర్తిగా అరికట్టాలన్న కృతనిశ్చయంతో ప్రభుత్వం ఉన్నదని పేర్కొన్నారు. నకిలీ విత్తన విక్రేతలపై కఠినచర్యలు తీసుకోవడంతోపాటు, పీడీయాక్ట్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం 450 గ్రాముల పత్తి ప్యాకెట్కు రూ.767 గరిష్ఠధర నిర్ణయించిందని, అంతకంటే ఎక్కువ రేటుకు విక్రయించవద్దని వ్యాపారులకు సూచించారు. వానకాలంలో ైగ్లెఫోసైట్ పెస్టిసైడ్ అమ్మకాలను నిషేధించామని, అది ఏ షాపులో కనిపించినా, వాటి లైసెన్సులు రద్దు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 2,600 రైతు వేదికల ద్వారా 1,60,950 మంది రైతుబంధు సమితి కార్యకర్తలకు నకిలీ విత్తనాలను గుర్తించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నకిలీ విత్తనాల నివారణలో పోలీసు, వ్యవసాయాధికారులతోపాటు రైతుబంధు సమితి కార్యకర్తలను భాగస్వామ్యం చేయాలని సూచించారు. ఎకువగా మిరప, పత్తి విత్తనాల్లో కల్తీ జరిగే అవకాశం ఉన్నదని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు వివరించారు.
టాస్ఫోర్స్ బృందాలు తమ పరిధిలోని విత్తన విక్రయదారుల దుకాణాలు, గోదాంలు, నర్సరీలను తనిఖీ చేయాలని సూచించారు. రాష్ట్రంలోని విత్తన దుకాణాలన్నింటినీ తనిఖీ చేయాలని టాస్ఫోర్స్ కమిటీలను ఆదేశించినట్టు నార్త్జోన్ విభాగం, సీడ్ టాస్ఫోర్స్ ఐజీ నాగిరెడ్డి తెలిపారు. అనుమానిత విత్తన ప్యాకెట్లను ముందుగా ఫొటోతీసి, కేటాయించిన వాట్సాప్ నంబర్కు పంపాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్లో ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్రెడ్డి, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, అదనపు డీజీ జితేందర్, ఐజీలు స్టీఫెన్ రవీంద్ర, ప్రభాకర్రావు, రాజేశ్కుమార్, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అన్ని జిల్లాల వ్యవసాయశాఖ అధికారులు పాల్గొన్నారు.
పోలీస్, వ్యవసాయశాఖలు సమన్వయంతో పనిచేసి, రాష్ట్రాన్ని నకిలీ విత్తన రహితంగా తీర్చిదిద్దాలని డీజీపీ ఎం మహేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. నకిలీ విత్తనాల చెలామణిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు కమిషనర్లు, ఎస్పీలు, వ్యవసాయాధికారులకు ఆయన పలు సూచనలిచ్చారు. నకిలీ విత్తన విక్రయదారులను గుర్తించి, వారిపై పీడీయాక్ట్ పెట్టాలని ఆదేశించారు. గత ఐదేండ్లలో నకిలీ విత్తనాలు విక్రయించి అరెస్టయినవారి వివరాలు, నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులు, పంటనష్టం, విక్రయదారుల సమాచారాన్ని సేకరించి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు.
-డీజీపీ మహేందర్రెడ్డి