హైదరాబాద్ : బోనాల పండుగలో వివిధ రకాల సేవలందిస్తున్న వృత్తిదారులను ప్రభుత్వం గుర్తించి గౌరవిస్తుందని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. సోమవారం మహంకాళి ఉమ్మడి ఆలయాల వృత్తిదారుల సంఘం ప్రతినిధులు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని ఆయన ఛాంబర్లో కలిసి సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వృత్తిదారులుగా బోనాల వేడుకల్లో పూజలు, సేవలను అందిస్తున్న వారి సమస్యలను ప్రభుత్వం పరిశీలించి పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు.
వంశపారంపర్యంగా ఆలయాల్లో సేవలు అందిస్తున్న వారందరికీ తగిన పారితోషికం, గుర్తింపు కల్పిస్తామన్నారు. తెలంగాణ మట్టి మనుషుల పండుగ బోనాల పండుగ అని అభివర్ణించారు. బోనాల పండుగ నిర్వహణ కోసం ఆలయాలకు దేవాదాయశాఖ నుంచి విడుదలైన నిధుల నుంచి వృత్తిదారులకు పారితోషికం అందించాలని దేవాదాయశాఖ అధికారులకు సూచించారు. ఈ సందర్బంగా ఉమ్మడి దేవాలయాల వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పేరోజీ మహేష్, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి నర్సింగ్ రావు, కోశాధికారి సుదర్శన్ తదితరులు మంత్రికి అమ్మవారి జ్ఞాపికను అందించి సన్మానించారు.